ఆ అనుభవం బాగుంది!

12 Sep, 2018 09:35 IST|Sakshi

సినిమా: కష్టమైనా ఆ అనుభవం బాగుంది అంటోంది నటి అనుష్కశర్మ. ఇప్పుడు బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌ ఈ బ్యూటీ. ఈమె నటించిన తాజా చిత్రం సుయ్‌దాగా. వరుణ్‌ధావన్‌ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీతలైన శరత్‌ కటారియా దర్శకత్వంలో మనీశ్‌శర్మ నిర్మించారు. ఇంది ఒక కుగ్రామంలో జరిగే కథాంశంతో తెరకెక్కిన చిత్రం. వరుణ్‌ధావన్‌ ఇందులో మౌజీ అనే పాత్రలో నటించారు. చిన్నచిన్న గ్రామాల్లో ఎక్కువగా వాడే వాహనం సైకిల్‌. అది అంటే మౌజీకి చాలా ఇష్టం. తన కష్టసుఖాలను దానితోనే పంచుకుంటాడు అని దర్శకుడు తెలిపారు. ఇది ప్రేమ, ఆత్మవిశ్వాసం ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కించిన చిత్రం అని ఆయన తెలిపారు. చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.

ధమ్‌ లగా కే హైసా వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రం తరువాత ఈ దర్శక నిర్మాతల ద్వయం రూపొందించిన చిత్రం సుయ్‌ దాగ. ఈ  చిత్రంలో తాను అనుష్కశర్మ కలిసి సైకిల్‌పై ప్రయాణం చేసే సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి. చిత్రం కోసం 15 రోజుల పాటు నిత్యం 10 గంటలు తొక్కాను అని నటుడు వరుణ్‌ధావన్‌ తెలిపారు. అరుణ్‌ధావన్‌ సైకిల్‌ తొక్కుతుంటే తాను ముందుకుర్చునే సన్నివేశాలు చిత్రంలో చోటు చేసుకుంటాయి.వేసవి కాలంలో మండుటెండలో ఉత్తర భారతదేశంలో ఆ సన్నివేశాలను చిత్రీకరించారు. నాకు సైకిల్‌పై కూర్చోవడం అలవాటు లేదు. నేనెప్పుడూ సైకిల్‌ను వాడలేదు. ఆ సన్నివేశాల చిత్రీకరణ కోసం ఎక్కువ సేపు సైకిల్‌పై కూర్చోవడం కష్టంగా ఉన్నా, ఆ అనుభవం బాగుంది అని నటి అనుష్కశర్మ అన్నారు. ఈ చిత్రంలో ఈ బ్యూటీ వేషధారణ, అభినయం గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటాయి. ఇందులో అచ్చం గ్రామీణ యువతిగా అనుష్కశర్మ మారిపోయారు. యాష్‌రాజ్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రంపై సినీ భారతంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రం ఈ నెల 28వ తేదీన ప్రçపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు.

మరిన్ని వార్తలు