ఇప్పుడు భానుమతిగా..

24 Feb, 2018 04:41 IST|Sakshi
అనుష్క

తమిళసినిమా: ఏ పాత్రలో నటిస్తే ఆ పాత్రలో ఒదిగిపోవడం నటి అనుష్కకు వెన్నతో పెట్టిన విద్య. అరుంధతిలో అందంతో పాటు రౌద్రం చూపించినా, రుద్రమదేవిలో వీరత్వం చూపినా, బాహుబలిలో శౌర్యప్రరాక్రమాలను ప్రదర్శించినా, భాగమతిలో భయబ్రాంతులకు గురి చేసినా అద్భుతమైన నటనతో తనకు తానే అని చాటుకున్న అందరి స్వీటీ అనుష్క. త్వరలో గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో ఒక మల్టీస్టారర్‌ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్న అనుష్క అంతకు ముందు ప్రఖ్యాత నటీమణి భానుమతిగా మారనున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది.

మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఇతివృత్తంతో ద్విభాషా చిత్రం (తమిళం, తెలుగు)గా తెరకెక్కుతున్న నడిగైయార్‌ తిలగం(తెలుగులో మహానటి) చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పలు విశేషాలతో కూడుకున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో సావిత్రిగా యువ నటి కీర్తీసురేశ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాత్రను ఈమె పోషించడంపై సీనియర్‌ నటి, సావిత్రి సమకాలీన నటి జమున ఆక్షేపణను వ్యక్తం చేసినట్లు మీడియాల్లో వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో చిత్రంపై మరింత ఉత్సుకత కలుగుతోంది.

ఇందులో సావిత్రితో అనుబంధం ఉన్న పలువురు గొప్పగొప్ప నటీనటుల పాత్రల్లో యువ తారాగణం నటిస్తున్నారు. ముఖ్యంగా విలేకరి పాత్రలో నటి సమంత, సావిత్రి భర్త జెమినీగణేశన్‌గా మలయాళ యువ నటుడు దుల్కర్‌సల్మాన్, మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో అర్జున్‌రెడ్డి చిత్రం ఫేమ్‌ విజయ్‌దేవరకొండ, ఎస్‌వీ.రంగారావు పాత్రలో మోహన్‌బాబు నటిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. తాజాగా నటి భానుమతిగా అనుష్క నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి అధికారికంగా ప్రకటన వెలువడనప్పటికీ ఇదే నిజమైతే ఈ చిత్ర కలరే మారిపోతుంది.

మరిన్ని వార్తలు