ఆయన ధైర్యాన్ని అభినందిస్తున్నా!

11 Mar, 2016 03:10 IST|Sakshi
ఆయన ధైర్యాన్ని అభినందిస్తున్నా!

నెగెటివ్ ప్రచారాన్ని ఆపండి, సెంటిమెంట్లను పక్కన పెట్టండి అన్నారు యువ దర్శకుడు మోహన్‌రాజా. సంగీతదర్శకుడు విజయ్‌ఆంటోని సంగీతం అందించి, కథానాయకుడిగా నటించి సొంతంగా నిర్మించిన చిత్రం పిచ్చైక్కారన్. శశి కథ, కథనం,దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించిన ఈ చిత్రం గత వారం తెరపైకి వచ్చి విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం సాయంత్రం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. స్థానిక వడపళనిలోని ఆర్‌కేవీ.స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దర్శకుడు మోహన్‌రాజా మాట్లాడుతూ పిచ్చైక్కారన్ టైటిల్‌పై కొనసాగుతున్న నెగెటివ్ ప్రచారానికి చిత్ర విజయం పుల్‌స్టాప్ పెట్టిందన్నారు.తాను తన చిత్రానికి తనీఒరువన్ అని పేరు నిర్ణయించినప్పుడూ అదేం పేరు ఆ చిత్రంతో మోహన్‌రాజా ఒంటరి వాడయైపోతారనే ప్రచారం జరిగిందన్నారు.

ఆ చిత్ర విజయం అలాంటి వాళ్ల నోళ్లను మూయించిదని వ్యాఖ్యానించారు. తాను తనీఒరువన్ పెడితేనే అలాంటి కామెంట్స్ చేసిన వాళ్లు విజయ్‌ఆంటోని పిచ్చైక్కారన్ టైటిల్‌ను నిర్ణయించనప్పుడు ఇంకెలా నెగెటివ్ ప్రచారం చేస్తారోనని అనుకున్నానన్నారు. దీన్ని పలువురు రాంగ్ సెంటిమెంట్ అంటూ ప్రచారం చేశారని గుర్తు చేశారు.అలాంటి ప్రచారాన్ని ఎదురొడ్డి పిచ్చైక్కారన్ విజయపథంలో దూసుకుపోతోందన్నారు. అలాంటి టైటిల్‌తో చిత్రం చేసిన విజయ్‌ఆంటోని ధైర్యానికి అభినందిస్తున్నానన్నారు.
 
పిచ్చైక్కారన్ కాపాడింది
 పిచ్చైక్కారన్ చిత్రం విజయవంతం అయ్యి తనను కాపాడిందని ఆ చిత్ర కథానాయకుడు, నిర్మాత విజయ్‌ఆంటోని అన్నారు.దర్శకుడు శశి పిచ్చైక్కారన్ టైటిల్ చెప్పగానే బాగా నచ్చేసిందన్నారు.తన భార్యకు ఆ పేరు గురించి చెప్పగా చాలా మెస్మరైజ్ అయ్యారన్నారు. పిచ్చైక్కారన్ లాంటి చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడు శశికి కృత జ్ఞలు చెప్పుకుంటున్నానని అన్నారు.చిత్రాన్ని విడుదల చేసిన ఆర్‌కే ఫిలింస్, స్కైలార్క్ అధినేతలు తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
 

>