అప్పూ ఏం చేశాడు?

4 Jun, 2017 02:11 IST|Sakshi
అప్పూ ఏం చేశాడు?

చిన్నారుల చిన్ని చిన్ని కోరికలను తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే ఏమౌతుంది? పసి వయసులో తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఏం కోరుకుంటారు? అనే సందేశంతో రూపొందిన బాలల సినిమా ‘అప్పూ’. ది క్రేజీ బాయ్‌.. అనేది ఉపశీర్షిక. టైటిల్‌ రోల్‌లో ‘మాస్టర్‌’ సాయి శ్రీవంత్, ప్రధాన పాత్రల్లో జాకీ, లోహిత్‌కుమార్, కావ్య, బండ జ్యోతి, జ్వాలా చక్రవర్తి, ఫణి నటించారు. మోహన్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై కె. మోహన్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌ కాపీ సిద్ధమైంది.

త్వరలో సెన్సార్‌ పూర్తి చేసి, సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శక–నిర్మాత కె. మోహన్‌ మాట్లాడుతూ – ‘‘ఎనిమిదేళ్ల అప్పూకి ఏనుగును చూడాలని కోరిక. అతని తల్లిదండ్రులకు చూపించే తీరిక ఉండదు. ఎవరి ఉద్యోగాల్లో వాళ్లు బిజీ. అప్పుడు అప్పూ ఏం చేశాడనేది చిత్రకథ. అప్పూగా సాయి శ్రీవంత్‌ అద్భుతంగా నటించాడు. దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావుగారితో పాటు మరికొందరి దగ్గర సహాయ దర్శకుడిగా, కో–డైరెక్టర్‌గా పని చేశాను. తొలి ప్రయత్నంగా ప్రేక్షకులకు ఓ మంచి సినిమా అందించాలని ‘అప్పూ’ చేశాను’’ అన్నారు.