కల గన్నావా.. బుజ్జి నాయనా..!

17 Mar, 2015 22:57 IST|Sakshi
కల గన్నావా.. బుజ్జి నాయనా..!

 తొమ్మిదేళ్ల బాలుడు అప్పూకి ఏనుగంటే చాలా ఇష్టం. నగర జీవితంలో ఉరుకుల, పరుగుల ఉద్యోగాలు చేస్తూ క్షణం తీరిక లేని అప్పూ తల్లిదండ్రులకు కొడుక్కి ఏనుగుని చూపించే తీరిక ఉండదు. చివరికి, తానే ఏనుగును చూడడానికి స్నేహితులతో కలిసి ఓ అడవిలోకి వెళతాడు అప్పూ. అక్కడ అప్పూ బృందం ఎదుర్కొన్న సవాళ్లేంటి? ఏనుగుని చూడగలిగారా? అనే అంశాలతో సాగే చిత్రం ‘అప్పూ’. ఉపశీర్షిక ‘ది క్రేజీ బాయ్’. టైటిల్ రోల్‌ను మాస్టర్ సాయి శ్రీవంత్, ముఖ్య పాత్రలను లోహిత్, ఆదిలాబాద్ గిరిజన నాయకుడు జాదవ్ కృష్ణ నాయక్, ఆయన తనయుడు మహేశ్ నాయక్ తదితరులు చేస్తున్నారు.

మోహన్ మూవీ మేకర్స్ పతాకంపై కె. మోహన్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రవిశేషాలను మోహన్ తెలియజేస్తూ -‘‘ఇటీవల ఆదిలాబాద్‌లోని కుంతాల జలపాతం సమీపంలో ‘కలగన్నావా.. బుజ్జి నాయనా..’, ‘ఏంటో కొత్తగా ఉందా ఈ లోకం..’ పాటల్లో కొంత భాగం చిత్రీకరించాం. మిగతా భాగం చిత్రీకరణ 26న మొదలుపెట్టబోతున్నాం. హైదరాబాద్, నర్సాపూర్‌లో జరిపే షెడ్యూల్స్‌తో చిత్రం పూర్తవుతుంది’’ అన్నారు. బండ జ్యోతి, కావ్య, బాల తారలు సాయి అభిషేక్, లాస్య, మేఘన, జాషువా, మనోజ్ఞ, ఆదా, చిరుహాస్, సద్దాం కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి సంగీతం శ్రీ అందిస్తున్నారు.