రవితేజ డైరెక్టర్‌తో రజనీ దర్శకుడు

5 Jan, 2020 17:11 IST|Sakshi

సందేశంతో కూడిన కమర్షియల్‌ చిత్రాలను తెరకెక్కించడంలో డైరెక్టర్‌ ఏఆర్‌ మురుగదాస్‌ దిట్ట. తాజాగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా మురుగదాస్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘దర్బార్‌’. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. చాలా కాలం తర్వాత రజనీ పోలీస్‌ గెటప్‌లో అభిమానులను కనువిందు చేయనున్నాడు. ఇక చిత్ర ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రజనీ, దర్బార్‌ టీంతో పాటు టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అయితే ప్రమోషనల్‌ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌లోనే ఉన్న డైరెక్టర్‌ ఏఆర్‌ మురగదాస్‌.. రవితేజ తాజా చిత్రం ’క్రాక్‌’ సెట్‌ను సందర్శించారు. 

ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన విషయాలను తెలుసుకున్న మురుగదాస్‌ అనంతరం డైరెక్టర్‌ గోపిచంద్‌ మలినేనికి చిత్ర సభ్యులకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఏఆర్‌ మురుగదాస్‌ క్రాక్‌ సెట్‌ను సందర్శించిన ఫోటోను గోపిచంద్‌ మలినేని తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. కాగా, డాన్‌ శీను, బలుపు వంటి చిత్రాలతో కమర్షియల్‌ డైరెక్టర్‌గా పేరొందిన గోపీచంద్‌ మలినేని తాజాగా రవితేజతో మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో టెంపర్‌ పోలీసాపీసర్‌గా రవితేజ కనిపించునున్నాడు. ఇప్పటికే న్యూఇయర్‌ కానుకగా విడుదలై ‘క్రాక్‌’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. సమ్మర్‌లో విడుదల కానున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతమందిస్తుండగా స‌రస్వతి ఫిలింస్ డివిజ‌న్‌ బ్యానర్‌పై బి. మధు నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే రవితేజ హీరోగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ‘డిస్కో రాజా’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. రిపబ్లిక్‌ డే కానుకగా జనవరి 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరిన్ని వార్తలు