ముందుంది మ్యూజిక్‌ ఫెస్టివల్‌

5 Aug, 2018 01:02 IST|Sakshi
విల్‌ స్మిత్, రెహమాన్‌

స్క్రీన్‌పై శంకర్‌ చేసే విజువల్‌ మ్యాజిక్‌కు ఏఆర్‌ రెహమాన్‌ తన మ్యూజిక్‌ టచ్‌తో సీన్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతారు. ‘జెంటిల్‌మెన్‌’తో స్టార్ట్‌ అయిన వీళ్ల జర్నీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ సూపర్‌హిట్‌ కాంబినేషన్‌ రజనీకాంత్‌ ‘2.0’ సినిమా కోసం వర్క్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా బ్కాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ పనిలో బిజీగా ఉన్నారట ఏఆర్‌ రెహమాన్‌. అందులో భాగంగా కొన్ని సీన్స్‌ చూసి ఇలా మాట్లాడారు – ‘‘2.0’లో ఓ సాంగ్‌ చూశాను. సీజీ వర్క్‌ లేదు. అయినా కూడా పాట బ్రహ్మాండంగా ఉంది. కేవలం శంకర్‌ మాత్రమే ఇలా ఆలోచించగలడు. క్లైమాక్స్‌ విషయానికి వస్తే నమ్మశక్యంగా అనిపించలేదు. అంత బాగుంది. శంకర్‌ లాంటి టెక్నీషియన్‌తో వర్క్‌ చేయడం ఆనందంగా ఉంది.

అలాగే స్క్రీన్‌ మీద సూపర్‌ స్టార్‌ రజనీకాంత్, అక్షయ్‌ కుమార్‌లను చూడటం ప్రేక్షకులకు కనువిందుగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ‘2.0’ సినిమా నవంబర్‌ 29న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. హాలీవుడ్‌ యాక్టర్‌ విల్‌ స్మిత్‌ను రెహమాన్‌ ఇటీవల కలిశారు. ఈ ఇద్దరూ ఏదైనా ప్రాజెక్ట్‌ మీద వర్కౌట్‌ చేస్తున్నారా? అంటే.. సినిమా కోసం కాదు కానీ మ్యూజిక్‌ ఫెస్టివల్‌ కోసమని సమాచార ం. ‘‘వన్‌ అండ్‌ ఓన్లీ విల్‌ స్మిత్‌తో నా మనసుకు చాలా నచ్చిన విషయమై సుదీర్ఘంగా చర్చించాం’’ అంటూ విల్‌ స్మిత్‌తో కలసి దిగిన ఫొటోను షేర్‌ చేశారాయన. డిసెంబర్‌లో చెన్నైలో జరగనున్న మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో వీళ్లిదరూ కలసి పెర్ఫామ్‌ చేయనున్నారని సమాచారం. సో.. నవంబర్‌లో ‘2.0’, డిసెంబర్‌లో మ్యూజిక్‌ ఫెస్టివల్‌తో రెహమాన్‌ ఫ్యాన్స్‌ అందరికీ ముందుంది మ్యూజిక్‌ ఫెస్టివల్‌.
 

మరిన్ని వార్తలు