ఆదిత్యవర్మగా ‘అర్జున్‌ రెడ్డి’

3 Jun, 2019 14:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే కొత్త చరిత్రను సష్టించిన అలనాటి బెంగాలీ  ‘దేవదాస్‌ (1935)’ చిత్రానికి, తెలుగులో వచ్చిన ఇప్పటి ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రాలకే కాకుండా వాటిలో నటించిన దర్శక నటుడు ప్రమతేష్‌ చంద్ర బారువా (పీసీ బారువా)కు, విజయ దేవరకొండకు మధ్య పలు విషయాల్లో పోలికలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాల్లో నటించిన హీరోలు రాత్రికి రాత్రి స్టార్‌ హీరోలయ్యారు. నాటి దేవదాస్, నేటి అర్జున్‌ రెడ్డి చిత్రాల్లో హీరోలిద్దరు భగ్న ప్రేమిక పాత్రలే. హదయాన్ని కలచివేస్తోన్న ప్రేమానుభూతులను మద్యం మత్తులో మరచిపోయేందుకు ప్రయత్నించే పాత్రలే. నాటి దేవదాస్‌ చిత్రంతో చలనచిత్రాలు కేవలం వినోదానికి మాత్రమే పరిమితమన్న భావన నుంచి సామాజిక స్పహ కూడా ఉంటుందన్న కొత్త భావాన్ని జనంలోకి తీసుకెళ్లింది. అలాగే అర్జున్‌రెడ్డి చిత్రానికి కూడా కాలేజీలు మన కళ్ల ముందు కనిపించే వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టిందన్న ప్రశంస కూడా వచ్చింది.

నాటి ‘దేవదాస్‌’ చిత్రంతో దాన్ని రాసిన ప్రముఖ బెంగాలీ కవి శరత్‌ చంద్ర  చటోపాధ్యాయ్‌ పేరు కూడా బెంగాల్‌ రాష్ట్రంలో ఇంటింట తెల్సింది. అప్పటి వరకు పెద్దగా చిత్రాలను పట్టించుకోని శరత్‌ చంద్ర అప్పటి నుంచి దక్షిణ కోల్‌కతాలోని ‘న్యూ థియేటర్స్‌ స్టుడియో’కు తరచుగా వెళ్లడం ప్రారంభించారట. ఆ తర్వాత పీసీ బారువా అంటే దేవదాస్, దేవదాస్‌ అంటే పీసీ బారువాగా పేరు పడింది. దాంతో బారువా ఆ చిత్రాన్ని హిందీలో తీయాలనుకున్నారు. అయితే తన హిందీ ఉచ్ఛారణ బాగుండదని తలచి, అప్పటికే పాటలతో పరిచయమున్న కేఎల్‌ సైగల్‌ హీరోగా హిందీ ‘దేవదాస్‌’ తీశారు. అది కూడా ప్రేక్షకుల ప్రజాదరణ పొందడమే కాకుండా కమర్షియల్‌గా సక్సెస్‌ అయింది. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెలుగులో వచ్చిన ‘దేవదాసు’ కూడా సూపర్‌డూపర్‌ హిట్టయింది. ఆ తర్వాత హిందీలోనే దిలీప్‌కుమార్, షారూక్‌ ఖాన్‌లు హీరోలుగా దేవదాస్‌ చిత్రాలు వచ్చాయి.

నాటి బెంగాలీ దేవదాస్‌కు, అర్జున్‌రెడ్డి చిత్రాలకు మరో పోలిక కూడా ఉంది. అదే దేవదాస్‌ చిత్రం ద్వారా రచయిత శరత్‌ చంద్ర పేరు ఇల్లిళ్లు తెలిసిపోగా, అర్జున్‌రెడ్డి చిత్రం ద్వారా ఎవరికి తెలియని ఆ సినిమా కథా రచయిత ‘సందీప్‌ రెడ్డి వంగా’ గురించి తెలుగు ప్రేక్షకులకు తొలిసారి తెలిసింది. ఆయనకు అర్జున్‌రెడ్డి కథ రాయడానికి రెండేళ్లు పట్టగా, అది సినిమాగా రావడానికి మరో నాలుగేళ్లు (2017) పట్టింది. ఇప్పుడు అదే కథ ఆధారంగా హిందీలో షాహిద్‌ కపూర్‌ హీరోగా ‘కబీర్‌ సింగ్‌’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈనెల 21వ తేదీన విడుదలవుతోంది. మరోపక్క ఇదే కథతో ‘ఆదిత్య వర్మ’ చిత్రం తమిళంలో నిర్మాణం అవుతోంది. ఆ సినిమాలో ‘ధృవ్‌ విక్రమ్‌’ హీరోగా పరిచయం అవుతున్నారు.

మరిన్ని వార్తలు