ఈసారి త్రీడీలో?

9 Oct, 2015 22:46 IST|Sakshi
ఈసారి త్రీడీలో?

రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ‘రోబో’ ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో శంకర్ ఉన్నారని సమాచారం. తొలి భాగానికన్నా  మలిభాగం మరింత భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. త్రీడీ మూవీగా ‘రోబో 2’ని తీయాలన్నది శంకర్ లక్ష్యం అని చెన్నయ్ టాక్. రజనీ సరసన దీపికా పదుకొనేని కథానాయికగా తీసుకోవాలనుకుంటున్నారనే వార్త వచ్చింది. అయితే, శంకర్ మనసు మారిందట.

ఫస్ట్ పార్ట్‌లో నటించిన ఐశ్వర్యా రాయ్‌నే తీసుకోవాలనుకుంటున్నారట.
 
పారితోషికం ఫిక్స్ అయితే యస్!
ఈ సీక్వెల్‌కి సంబంధించి ప్రచారం అవుతున్న వార్తల్లో ఆర్నాల్డ్ ష్వార్జెనెగ్గర్‌కి సంబంధించిన వార్త ఒకటి. శంకర్ దర్శకత్వం వహించిన ‘ఐ’ ఆడియో వేడుకలో ఈ హాలీవుడ్ స్టార్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఆయన ‘రోబో 2’లో నటించానున్నారని టాక్. మొదట్లో ఈయన విలన్‌గా నటిస్తారనే వార్త వచ్చింది. అయితే, మరో హీరోగా నటిస్తారట. ప్రస్తుతం ఆర్నాల్డ్ పారితోషికం గురించి చర్చలు జరుగుతున్నాయని బోగట్టా. పారితోషికం ఫిక్స్ అయితే ఆర్నాల్డ్ యస్ చెబుతారని సమాచారం. మరి.. ఆర్నాల్డ్ ‘రోబో 2’లో నటిస్తారా? ఇది త్రీడీ మూవీయా? అసలు నిజంగానే ఈ ప్రాజెక్ట్ ఉందా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.