‘అందుకే దూరంగా ఉండాలనుకున్నాను’

22 Dec, 2018 16:47 IST|Sakshi

అనుకోకుండా వచ్చిన స్టార్‌డమ్‌ నన్ను అణచివేసినట్లు అనిపించింది. అందుకే కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండాలనుకున్నాను అన్నారు విలక్షణ నటుడు అరవింద్‌ స్వామి. ‘రోజా’, ‘బాంబే’ వంటి చిత్రాల ద్వారా తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోగా మారారు అరవింద్‌ స్వామి. ఆ తర్వాత సినిమాలకు దూరమైన అరవింద స్వామి మణిరత్నం ‘కడలి’ ద్వారా తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించి సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నారు.

ఇండియా టూడే ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన అరవింద్‌ తన రీల్‌, రియల్‌ లైఫ్‌ ప్రయణాల గురించి ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ.. ‘అనుకోకుండా నటున్ని అయ్యాను. కానీ స్టార్‌డమ్‌ని కోరుకోలేదు. అదే వచ్చింది. నేను హీరోగా కంటే నటుడిగా గుర్తింపబడాలని కోరుకున్నాను. కాలేజీలో ఉన్నప్పుడు డబ్బు కోసం మోడలింగ్‌ చేసేవాడిని.. ఆ తరువాత ప్రకటనలు. అప్పుడు నన్ను చూసిన మణిరత్నం నాకు దళపతి సినిమాలో అవకాశం ఇచ్చారు’ అంటూ చెప్పుకొచ్చారు.

కొనసాగిస్తూ.. ‘ఆ తరువాత వచ్చిన ‘రోజా’, ‘బాంబే’ సినిమాలు నాకు స్టార్‌డమ్‌ తీసుకొచ్చాయి. దీనివల్ల నా మీద ఒత్తిడి పెరిగింది.. నా ప్రైవసీని కూడా కోల్పోయాను. ఈ స్టార్‌డమ్‌ నన్ను అణచివేస్తున్నట్లు అనిపించింది. ఇదంతా నాకు కొత్తగా, చాలా ఇబ్బందిగా తోచింది. రోజా తర్వాత అమెరికా వెళ్లి మాస్టర్స్‌ చేయాలనుకున్నాను. అమెరికా వెళ్లాను. ఆ తర్వాత బిజినేస్‌ ప్రారంభించాను. 2005లో దాన్ని వదిలేశాను. అప్పటికే నేను సింగిల్‌ పేరెంట్‌ని. నా పిల్లల కోసం సమయం కేటాయించాల్సి వచ్చింది. సరిగా అదే సమయంలో నాకు యాక్సిడెంట్‌ కూడా అయ్యింది. ఇన్నీ జరిగాయి.. కానీ మళ్లీ ఎప్పుడు సినిమాల్లోకి తిరిగి రావాలని అనుకోలేద’ని తెలిపారు.

ఆ సమయంలో మణిరత్నం మళ్లీ నన్ను ‘కడలి’ సినిమాకోసం పిలిపించారన్నారు. రాజకీయాల్లోకి వచ్చే అంశం గురించి మాట్లాడుతూ.. ‘నేను నటున్ని. నటించడం మాత్రమే నా పని. మరేందుకు నా నుంచి రాజకీయాలను ఆశిస్తున్నారు. నటుడిగా ఏదైనా అంశాన్ని వెలుగులోకి తేగలను.. కానీ దానికి పరిష్కారం చూపలేను కదా’ అన్నారు. మీటూ గురించి అడగ్గా.. ఈ విషయం గురించి నాకు పూర్తిగా తెలియదు. కాబట్టి దీని గురించి మాట్లాడలేను అంటూ సమాధానమిచ్చారు.

మరిన్ని వార్తలు