టీ.నగర్: ‘అవన్–ఇవన్’ చిత్రం వ్యవహారంలో అంబాసముద్రంలో హాజరయ్యేందుకు నటుడు ఆర్యకు హైకోర్టు మినహాయింపునిస్తూ గురువారం ఉత్తర్వులిచ్చింది. పాళయంకోట్టైకు చెందిన ముత్తురామన్ అనే వ్యక్తి అంబాసముద్రం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. అందులో ప్రసిద్ధి చెందిన జమీన్ను, పురాతన సోరిముత్తు అయ్యనార్ ఆలయాన్ని ‘అవన్–ఇవన్’ చిత్రంలో కించపరిచే విధంగా చూపినట్లు తెలిపారు. ఇది తమకు ఆవేదన కలిగించిందని, అందువల్ల చిత్ర దర్శకుడు బాల, నటుడు ఆర్యపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసు విచారణ ప్రస్తుతం అంబాసముద్రం కోర్టులో జరుగుతోంది. దీంతో నటుడు ఆర్య కోర్టులో హాజరుకావాలంటూ మెజిస్ట్రేటు ఉత్తర్వులిచ్చారు.
ఇలావుండగా నటుడు ఆర్య తరఫున మదురై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అందులో ముత్తురామన్ అంబాసముద్రం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ప్రాథమిక ఆధారాలు లేవని, ఇది కేవలం పబ్లిసిటీ కోసం దాఖలైనట్లు తెలిపారు. అందువల్ల కేసు రద్దు చేయాలని, అంతేకాకుండా అంబై కోర్టులో హాజరుకావడం నుంచి మినహాయింపు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి కృష్ణకుమార్ సమక్షంలో విచారణకు వచ్చింది. ఆ సమయంలో పిటిషన్కు సంబంధించి నటుడు ఆర్య అంబాసముద్రం కోర్టులో నేరుగా హాజరు కావడం నుంచి మినహాయింపునిస్తూ న్యాయమూర్తి ఈ సందర్భంగా ఉత్తర్వులిచ్చారు.