నిర్మాతగా... 300 కోట్లు!

12 Dec, 2016 14:41 IST|Sakshi
నిర్మాతగా... 300 కోట్లు!

వరుస చిత్రాలతో, వందల కోట్ల వసూళ్ళతో బాలీవుడ్‌లో దూసుకుపోతున్న కండల వీరుడు సల్మాన్‌ఖాన్ ఇప్పుడు నిర్మాతగా వందల కోట్ల ఓ  భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుడుతున్నారు. సల్మాన్‌ఖాన్ ప్రొడక్షన్స్‌పై ఆయన రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఓ చారిత్రక చిత్రం తెరకెక్కించనున్నారు. 1914లో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. టొరొంటోలో వ్యాపారవేత్తగా కొనసాగుతున్న భారతీయుడు అజయ్ వీర్మాణితో కలిసి సల్లూ ఈ చిత్రం నిర్మించేందుకు సిద్ధమయ్యారు.

ఇర్ఫాన్‌ఖాన్‌ను హీరోగా ఎంపిక చేశారట. అజయ్ వీర్మాణి మాట్లాడుతూ- ‘‘అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించేందుకు భారీ బడ్జెట్ పెడుతున్నాం. ఈ చిత్రానికి సల్మాన్ భాగస్వామి కావడం సంతోషంగా ఉంది. ప్రపంచంలో ఇప్పటికీ జాతి వివక్ష కొనసాగుతోంది. ఆ పరిస్థితులనే చూపించనున్నాం. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళతాం’’ అని చెప్పారు.