ఏం జరిగింది?

16 Feb, 2019 02:41 IST|Sakshi
శ్రీరాం

శ్రీరాం, సంచితా పదుకొనే జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అసలేం జరిగింది’. కెమెరామేన్‌ ఎన్‌వీఆర్‌ ఈ చిత్రంతో దర్శకునిగా మారారు. ఎక్సోడస్‌ మీడియా బ్యానర్‌పై కె.నీలిమ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. శ్రీరాం, డ్యాన్సర్లపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రిక చీఫ్‌ ఎడిటర్‌ కట్టా శేఖర్‌రెడ్డి కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా, క్రెడాయ్‌ జాతీయ మాజీ అధ్యక్షుడు సి.శేఖర్‌రెడ్డి క్లాప్‌ ఇచ్చారు. కట్టా శేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘గ్రామీణ నేపథ్యంలో ఒక సస్పెన్స్‌ లవ్‌ స్టోరీని తెరకెక్కిస్తున్నందుకు యూనిట్‌కి అభినందలు తెలిపారు.

ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న కథాంశాన్ని ఎంచుకుని, ఆకర్షణీయమైన రీతిలో చిత్రీకరించే సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయి. అలాంటి కోవలోకే ‘అసలేం జరిగింది’ వస్తుంది’’ అన్నారు. ‘‘తెలంగాణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా పూర్తి చేసి, మే చివరిలోపు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని కె.నీలమ అన్నారు. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ శ్రీకర్‌ రెడ్డి, గిరిధారి హోమ్స్‌ ఎండీ ఇంద్రసేనారెడ్డి, బొమ్మారం గ్రామ సర్పంచి శంకర్, లక్ష్మారెడ్డి, పాస్టర్‌ ప్రేమ్‌ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహావీర్‌.

మరిన్ని వార్తలు