మళ్లీ బుల్లితెరపైకి ఆశుతోష్

18 Aug, 2013 23:28 IST|Sakshi
మళ్లీ బుల్లితెరపైకి ఆశుతోష్
న్యూఢిల్లీ: అద్భుతమైన విలనీతో ప్రేక్షకులను మెప్పించే ఆశుతోష్ రాణా మళ్లీ బుల్లితెరవైపు వెళ్తున్నాడు. అయితే ఈసారి మనోడి గాలి రాజకీయాలవైపునకు మళ్లింది. ‘భారత్ భత్య విధాత: లోక్‌తంత్ర కా మేకోవర్’ పేరుతో నిర్వహించే రాజకీయ చర్చాకార్యక్రమానికి రాణా అతిథేయిగా వ్యవహరిస్తాడు. నిరుద్యోగం, మహిళల భద్రత, అవినీతి అంశాలపై ఇందులో చర్చలు ఉంటాయి. ఎంతో జనాదరణ పొందిన టీవీ సీరియల్ స్వాభిమాన్ ద్వారా రాణా బుల్లితెరకు పరిచయమయ్యాడు. 
 
 నాలుగేళ్ల తరువాత తిరిగి టీవీతెరపై దర్శనమివ్వనున్నాడు. జీన్యూస్ ఈ నెల 16 నుంచి ప్రసారం చేస్తున్న ‘నిషాన్ పే’ షోను కూడా ఈ 45 ఏళ్ల నటుడు నిర్వహిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో రాణా సామాన్యుడిగా గొంతుకను వినిపిస్తాడు. ‘మన నిత్యజీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలను ఇందులో ప్రస్తావిస్తాం. ఈ కార్యక్రమం 13 భాగాలుగా ప్రసారమవుతుంది. ప్రజలు లేవనెత్తే ప్రశ్నలకు జవాబులివ్వడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నాయకులు హాజరవుతారు’ అని రాణా వివరించాడు. బుల్లితెరపై మంచి కార్యక్రమాలు రావడం, బాలీవుడ్ తారలు కూడా వీటివైపు మొగ్గు చూపడం మంచి పరిణామమని రాణా అన్నాడు. గోవింద్ నిహ్లానీ సంశోధన్ సినిమా ద్వారా పరిచయమైన ఇతడు.. తదనంతరం దుష్మన్, సంఘర్ష్, హాసిల్‌లో విలన్‌గా అదరగొట్టాడు. 
 
 ఇటీవల విడుదలైన కిస్మత్ లవ్ పైసా దిల్లీ రాణా చివరి చిత్రం. ‘స్క్రిప్టుల ఆధారంగానే నేను సినిమాలకు ఒప్పుకుంటాను. కిస్మత్.. సినిమా స్క్రిప్టు నచ్చబట్టే అందులో నటించాను. దురదృష్టవశాత్తూ అది ప్రేక్షకులకు నచ్చలేదు. నేను తెలుగు సినిమాల్లోనూ నటిస్తున్నాను’ అని వివరించిన రాణా పవ న్ క ళ్యాణ్ హీరోగా వచ్చిన బంగారంలోనూ విలన్‌గా కనిపించాడు. రామ్‌గోపాల్ వర్మ అబ్‌తక్ చప్పన్-2, డర్టీ పాలిటిక్స్ రాణా తదుపరి సినిమాలు.