క్లాస్‌.. మాస్‌ అశ్వథ్థామ

12 Dec, 2019 00:28 IST|Sakshi
బుజ్జి, శంకర్‌ప్రసాద్, ఉషా ముల్పూరి, రమణ తేజ

‘‘సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అశ్వథ్థామ’. మా అబ్బాయి నాగశౌర్య మంచి కథ రాశాడు.. దాన్ని డైరెక్టర్‌ చక్కగా తెరకెక్కించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు నిర్మాత ఉషా ముల్పూరి. నాగశౌర్య, మెహరీన్‌ జంటగా నూతన దర్శకుడు రమణ తేజ తెరకెక్కించిన చిత్రం ‘అశ్వథ్థామ’. శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించిన ఈ సినిమా  జనవరి 31న  విడుదల కానుంది.

శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి మాట్లాడుతూ– ‘‘అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ని అలరించాలనే ఉద్దేశంతో ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాల్ని కాస్త ఎక్కువగానే తీశాం. ‘కేజీఎఫ్‌’ సినిమాకి ఫైట్స్‌ కంపోజ్‌ చేసిన అన్బు–అరివు మా సినిమాకి పనిచేశారు. ఈ సినిమాలో కొత్త నాగశౌర్యను చూస్తారు’’ అన్నారు. ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన ఐరా క్రియేషన్స్‌ వారికి థ్యాంక్స్‌. నన్ను నమ్మి దర్శకత్వ బాధ్యతలు అప్పగించిన నాగశౌర్యకి కృతజ్ఞతలు. మా సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా’’ అన్నారు రమణ తేజ. ‘‘అనుకున్న టైమ్‌లో సినిమాను పూర్తి చేశాం. మేం అనుకున్న దానికంటే ఔట్‌పుట్‌ బాగా వచ్చింది. ఇందుకు సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అని సహ నిర్మాత బుజ్జి అన్నారు.
 

మరిన్ని వార్తలు