అమ్మకు థ్యాంక్స్‌

8 Feb, 2020 02:29 IST|Sakshi
రమణతేజ, శంకర్‌ ప్రసాద్, ఉషా మూల్పూరి, నాగశౌర్య, బుజ్జి

– నాగశౌర్య

‘‘సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందన్నారు. ఆ పాజిటివ్‌ టాక్‌ వల్లే మా సినిమా ఇంత పెద్ద విజయం సాధించింది. ఇలాంటి సినిమా నాతో తీసినందుకు అమ్మకు థ్యాంక్స్‌’’ అన్నారు నాగశౌర్య. రమణ తేజ దర్శకత్వంలో నాగశౌర్య, మెహరీన్‌ జంటగా ఐరా క్రియేషన్స్‌పై ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘అశ్వథ్థామ’. జనవరి 31న విడుదలై మా చిత్రం దిగ్విజయంగా ప్రదర్శించబడుతోంది అన్నారు చిత్రబృందం. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా గ్రాండ్‌ సక్సెస్‌మీట్‌లో నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘రమణ తేజకు ఫుడ్, సినిమా.. ఈ రెండే ప్రాణం.

అతడిని నమ్మినందుకు సినిమాని బాగా తీశాడు. మరోసారి ‘నర్తనశాల’ లాంటి సినిమా చెయ్యను’’ అన్నారు. నిర్మాత శరత్‌ మరార్‌ మాట్లాడుతూ– ‘‘శౌర్య రాసిన కథ నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. తెలుగు సినీ పరిశ్రమకు నాగశౌర్య రూపంలో మరో యాక్షన్‌ స్టార్‌ లభించాడు’’ అన్నారు. ‘‘ఇప్పటివరకూ చేసిన సినిమాలతో రొమాంటిక్‌ హీరోగా ప్రూవ్‌ చేసుకున్నానని, ఈ సినిమాతో యాక్షన్‌ హీరోగా ప్రూవ్‌ చేసుకోవాలని శౌర్య అన్నప్పుడు ఆశ్చర్యపోయా. తను కథ బాగా రాసుకున్నాడు’’ అన్నారు రచయిత, దర్శకుడు బి.వియస్‌ రవి.

రమణ తేజ మాట్లాడుతూ– ‘‘శౌర్య నటించిన విధానానికి హ్యాట్సాఫ్‌. మంచి సినిమాలో నన్ను భాగం చేసినందుకు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను’’ అన్నారు.

ఉషా మూల్పూరి మాట్లాడుతూ– ‘‘శౌర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ వచ్చిన చిత్రంగా ‘అశ్వథ్థామ’ నిలిచినందుకు ఫుల్‌ హ్యాపీ. ఐరా క్రియేషన్స్‌లో ఇది బిగ్గెస్ట్‌ హిట్‌. ఇకముందు కూడా మా బ్యానర్‌ మంచి సినిమాలు అందిస్తుంది’’ అన్నారు.

‘‘ఐరా క్రియేషన్స్‌ ఏ సినిమా చేసినా టెక్నీషియన్లు, యాక్టర్లు అందరూ ఫ్యామిలీలా పనిచేస్తారు. అది వాళ్ల బలం’’ అన్నారు దర్శకురాలు నందినీ రెడ్డి. చిత్ర సమర్పకులు శంకర్‌ ప్రసాద్, లైన్‌ ప్రొడ్యూసర్‌ బుజ్జి, సినిమాటోగ్రాఫర్‌ మనోజ్‌రెడ్డి, ఎడిటర్‌ గ్యారీ, నటుడు ప్రిన్స్‌ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు