రాక్షసుణ్ణి నిద్రలేపాను!

22 Mar, 2016 23:28 IST|Sakshi
రాక్షసుణ్ణి నిద్రలేపాను!

‘‘ఈ సినిమాకు ముందు సి. కల్యాణ్‌గారు నన్ను కలిసి ‘నువ్వు చేయాల్సిన సినిమాలివి కావు’ అంటూ రెండు గంటలు క్లాస్ పీకారు. నా నుంచి డ్రామా, యాక్షన్ చిత్రాలను ప్రేక్షకులు ఆశిస్తున్నారన్నారు. చిరంజీవిగారి ‘కొట్టండి, తిట్టండి..’ అనే ఓ పాటను బేస్ చేసుకుని ఈ సినిమాలో ఓ పాట రాయించాను. అయితే ఈ పాట వేరే స్టయిల్‌లో ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే నాకున్న యాటిట్యూడ్‌తో అందరిలోని రాక్షసుణ్ణి నిద్రలేపా’’ అని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. మంచు మనోజ్, సురభి, జగపతిబాబు, వడ్డే నవీన్, ప్రకాశ్‌రాజ్ ప్రధానపాత్రల్లో శ్రీ శుభశ్వేత ఫిలిమ్స్ పతాకంపై రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వరుణ్, తేజ, శ్వేతలానా, సి.వి. రావు నిర్మించిన చిత్రం ‘ఎటాక్’. రవిశంకర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.

నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ- ‘‘ఏప్రిల్ 1న సినిమాను రిలీజ్ చేస్తున్నాం. రామాయణం, మహాభారత కథలను గుర్తుకు తెచ్చేలా సాగే చిత్రమిది’’ అని పేర్కొన్నారు. ‘‘ఫిల్మ్ మేకింగ్‌లో రామ్‌గోపాల్‌వర్మ ఓ యూనివర్సిటీ లాంటి వ్యక్తి. కల్యాణ్‌గారి బ్యానర్‌లో సినిమా చేయడం సంతోషంగా ఉంది’’ అని మంచు మనోజ్ తెలిపారు. ఈ వేడుకలో కథానాయికలు సురభి, పూనమ్ కౌర్, లైన్ నిర్మాత ప్రసాద్ గుమ్ములూరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సహ నిర్మాత మలినేని లక్ష్మయ్య చౌదరి, గాయకుడు ‘గజల్’ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.