హీరో ఎవరో ప్రేక్షకులే చెబుతారు :రాజేంద్రప్రసాద్‌

20 Nov, 2019 01:08 IST|Sakshi
దేవీ ప్రసాద్, విశ్వనాథ్, దుర్గాప్రసాద్, విశ్వంత్, చైతన్యప్రసాద్, రాజేంద్రప్రసాద్, సురేష్, హర్షిత

‘‘ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి, ఓ బేబీ’ వంటి మంచి సినిమాల తర్వాత నేను చేసిన మరో మంచి చిత్రం ‘తోలుబొమ్మలాట’. ఇలాంటి కథలకు హీరో ఎవరు? అనే దానిపై చర్చలు అనవసరం. ఈ సినిమా చూశాక  హీరో ఎవరో ప్రేక్షకులే చెబుతారు’’ అన్నారు డా. రాజేంద్రప్రసాద్‌. విశ్వంత్‌ దుద్దుంపూడి, హర్షిత చౌదరి జంటగా రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్, దేవీప్రసాద్, నర్రా శ్రీనివాస్‌ ప్రధాన తారాగణంగా విశ్వనాథ్‌ మాగంటి తెరకెక్కించిన చిత్రం ‘తోలుబొమ్మలాట’. ఐశ్వర్య మాగంటి సమర్పణలో దుర్గాప్రసాద్‌ మాగంటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న రిలీజ్‌ కానుంది.

ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘కథకి ఎవరైతే నాయకుడు అవుతారో వారే హీరో. ఈ సినిమాలో విశ్వంత్‌ హీరో’’ అన్నారు. ‘‘ప్రస్తుత కాలంలో ఇలాంటి సినిమాలు రావడం అరుదు. ఇది ప్రతి ఒక్కరి కథ’’ అన్నారు విశ్వంత్‌. ‘‘నా కుటుంబంతో కూర్చుని చూసే సినిమా చేయాలనుకుని ఈ కథ రాసుకున్నా’’ అన్నారు విశ్వనాథ్‌ మాగంటి.  ‘‘మా యూనిట్‌కి ఈ సినిమా మంచి గుర్తింపు అందించాలి’’ అన్నారు దుర్గా ప్రసాద్‌.


 

మరిన్ని వార్తలు