ముగ్గురూ ముగ్గురే

22 Jan, 2017 22:43 IST|Sakshi
ముగ్గురూ ముగ్గురే

అవసరాల శ్రీనివాస్‌ మంచి నటుడే కాదు.. రచయిత కూడా. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ చిత్రాల్లో రచయితగా అవసరాల చమత్కారాలు చూశాం. నటుడు అడివి శేష్‌ కూడా రచయితే. గతేడాది సూపర్‌హిట్‌ ‘క్షణం’కి కథ, స్క్రీన్‌ప్లే అందించింది ఆయనే. ఇప్పుడీ ఇద్దరూ కలసి హీరోలుగా ఓ సినిమా చేయనున్నారు. ‘అష్టా చమ్మా’, ‘అంతకు ముందు ఆ తర్వాత’, ‘జెంటిల్‌మన్‌’ చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు.

‘ఎ గ్రీన్‌ ట్రీ ప్రొడక్షన్స్‌’ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్న కేసీ నరసింహారావు మాట్లాడుతూ – ‘‘అవసరాల, అడివి శేష్, ఇంద్రగంటి... ముగ్గురూ ముగ్గురే. ఈ కాంబినేషన్‌కి తగ్గట్టు స్క్రూబాల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుంది. నిర్మాతగా నా తొలి సినిమాని ఇంద్రగంటి దర్శకత్వంలో చేయడం ఆనందంగా ఉంది. ఫిబ్రవరి 1న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘వెన్నెల’ కిశోర్‌ ముఖ్య పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి కెమేరా: పీజీ విందా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వినయ్, సంగీతం: మణిశర్మ.