‘బాహుబలి 2’ ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది!

27 Apr, 2017 13:32 IST|Sakshi
‘బాహుబలి 2’ ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది!

ముంబై: ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురుచూస్తున్న ‘బాహుబలి 2’  ఎలా ఉండబోతోంది. ఈ ప్రశ్నకు మరికొద్ది గంటల్లో సమాధానం లభించబోతోంది. ముంబైలో ఈరోజు రాత్రి బాలీవుడ్‌ ప్రముఖుల కోసం ప్రీమియర్‌ వేయనున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టాక్‌ బయటకు వచ్చింది. ‘బాహుబలి 2’ అద్భుతంగా ఉందని ఈ సినిమాను వీక్షించిన కేంద్ర సెన్సార్‌ బోర్డు సభ్యులు వెల్లడించారు. బాహుబలి మొదటి భాగం కంటే ఎంతో గొప్పగా, మెరుగ్గా ఉందని సెన్సార్‌ బోర్డు సభ్యుడొకరు ‘డీఎన్‌ఏ’ పత్రికతో చెప్పారు.

‘మొదటి భాగంతో పోలిస్తే బాహుబలి 2 ఎక్కువసేపు ఉంటుంది. దాదాపు మూడు గంటలపాటు సాగుతుంది. ఉత్కంఠభరితంగా సాగే కథనంతో మనకు సమయమే తెలియదు. సింగిల్‌ ఫ్రేమ్‌, షాట్‌, డైలాగుల్లో ఒక్క పదం కూడా కట్‌ చేయలేదు. ఒక్క కట్‌ కూడా చెప్పలేదు. పోరాట సన్నివేశాలు చాలా బాగా తీశారు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు హాలీవుడ్‌ కంటే సూపర్‌గా ఉన్నాయి. ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ 8 కంటే కూడా బాగున్నాయి. ప్రేక్షకులు తప్పకుండా హ్యాపీగా ఫీలవుతార’’ని తెలిపారు.

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న విషయాన్ని ప్రేక్షకులకు వదిలేయాలని, ఇది ఆడియన్స్‌ ను ఆశ్చర్యచకితులను చేస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రభాస్‌, రానా పోటీపడి నటించారని ప్రశంసించారు. ‘రెండు సింహాలు దీటుగా తలపడినట్టు వీరిద్దరూ నటించారు. కొన్ని సన్నివేశాల్లో కంటతడి కూడా పెట్టిస్తారు. దీని గురించి నేను వెల్లడించను. ఈసారి ఇద్దరూ సమానంగా ఆకట్టుకుంటార’ని వివరించారు.