బాహుబలి.. ఓ పాఠం!

17 Jan, 2018 00:27 IST|Sakshi

‘బాహుబలి’ సినిమా ఖాతాలో మరో రికార్డు చేరింది. అదేంటంటే.. ‘బాహుబలి’ సినిమా సక్సెస్‌ను పాఠంగా చెప్పబోతున్నారు. ఈ చిత్ర విజయాన్ని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అహ్మదాబాద్‌ (ఐఐఎమ్‌ఎ) ఓ కేస్‌ స్టడీగా తీసుకుని, పరిశోధన చేయనున్నట్లు అక్కడి ప్రొఫెసర్‌ భరతన్‌ కందస్వామి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ– ‘‘సీక్వెల్‌గా వచ్చిన ‘బాహుబలి’ చక్కని మార్కెటింగ్‌ స్ట్రాటజీతో మంచి వసూళ్లు రాబట్టింది. సీక్వెల్స్‌ తీస్తున్నప్పుడు ఫస్ట్‌ పార్ట్‌ సక్సెస్‌ అయితే రెండో పార్ట్‌కి పబ్లిసిటీ ఈజీగా వస్తుంది. మార్కెటింగ్‌ సులువు అవుతుంది.

ప్రధానంగా నేను సీక్వెల్స్‌ నిర్మాణం, మార్కెటింగ్‌ మంత్ర, కలెక్షన్స్‌ మీద దృష్టి పెట్టబోతున్నాను. ఈ విషయాల్లో అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థులకు డిజిటల్‌ మార్కెట్‌ గురించి కూడా చెబుతాం. సినిమా ఇండస్ట్రీ గురించి అన్ని కోణాల నుంచి విద్యార్థులకు తెలియజేయనున్నాం.అందుకే సక్సెస్‌ సాధించిన ‘బాహుబలి’ సినిమాను ఓ కేస్‌ స్టడీగా తీసుకోవాలని నిర్ణయించుకున్నాం’’ అన్నారు. రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మించిన ‘బాహుబలి’ బాక్సాఫీస్‌ దగ్గర ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.  ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్‌ ముఖ్య తారలుగా నటించిన ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీకి గర్వకారణంగా నిలిచింది.

మరిన్ని వార్తలు