‘బాహుబలి’ అభిమానులకు చేదువార్త

8 May, 2017 11:35 IST|Sakshi
‘బాహుబలి’ అభిమానులకు చేదువార్త

వెండితెరపై సంచలనాలు సృష్టించిన బాహుబలి సిరీస్‌ ఇక కొనసాగదా? అంటే అవుననే అంటున్నారు రచయిత కేవీ విజయేంద్రప్రసాద్‌. ‘బాహుబలి 3’ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో మూడో భాగం తెరకెక్కిస్తారని వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. ‘బాహుబలి కథ ముగిసింది. మూడో భాగం లేదు. నేను, మా అబ్బాయి రాజమౌళి దీని గురించి ప్లాన్‌ చేయడం లేదు. ఈ పాయింట్‌ గురించి నేనేమీ రాయడం లేదు.  అయితే కామిస్‌ సిరీస్‌, టీవీ మాధ్యమం ద్వారా బాహుబలి లెగసీ కొనసాగుతుంద’ని పీటీఐతో చెప్పారు.

దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కూడా ‘బాహుబలి 3’ ఉండదని ఇంతకుముందు వెల్లడించారు. బ్రిటీష్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు అడిగిన ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇస్తూ... బాహుబలి 3 కోసం కథ రెడీగా లేకుండా ప్రేక్షకులను మోసం చేయలేనని అన్నారు. అయితే  ఏదో ఒక రూపంలో బాహుబలి సిరీస్‌ కొనసాగుతుందని చెప్పారు. బాహుబలి మొదటి రెండు భాగాలు ఘన విజయం సాధించిన నేపథ్యంలో దీనిపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. అయితే బాహుబలి 3 ఉండదన్న వార్త అభిమానులకు నిరాశ కలిగించేదే.