త్వరలో సెట్స్‌ మీదకు బాహుబలి ప్రీక్వెల్‌

6 May, 2018 10:47 IST|Sakshi

తెలుగు సినిమా మార్కెట్‌ను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన భారీ చిత్రం బాహుబలి. రెండు భాగాలుగా రిలీజ్‌ అయిన ఈ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డలు సంయుక్తంగా నిర్మించారు. భారీ బడ్జెట్‌ తో నిర్మించటమే కాదు అదే స్థాయిలో ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా నిర్వహించి సినిమా ఘనవిజయం సాధించేందుకు తమవంతుగా కష్టపడ్డారు.

తాజాగా బాహుబలి 2 చైనాలో రిలీజ్‌ అయి మంచి విజయం సాధించింది. ఈ సందర్బంగా తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్న నిర్మాతలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. త్వరలో బాహుబలికి ప్రీక్వెల్‌ను నిర్మించనున్నట్టుగా తెలిపారు. ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో ఆన్‌లైన్‌ సీరీస్‌గా ఈ ప్రీక్వెల్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులోనే చిత్రీకరణ ప్రారంభించేందుకు రెడీ సిద్ధమవుతున్నట్టుగా తెలిపారు.

ప్రస్తుతం ఉన్న మాహిష్మతి సెట్‌తో పాటు మరికొన్ని సెట్స్‌ను రూపొందించి శివగామి చిన్నతనం నుంచి జరిగే కథతో ఈ ప్రీక్వెల్ చిత్రీకరించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ప్రీక్వెల్‌లో అంతా కొత్త నటీనటులు కనిపించనున్నారు. ఎవరు దర్శకత్వం వహిస్తారు, ఎప్పుడు రిలీజ్‌ అవుతుంది లాంటి వివరాలను త‍్వరలోనే వెల్లడించనున్నారు. ఇప్పటికే ఆనంద్‌ నీలకంఠన్‌ ద రైజ్‌ ఆఫ్ శివగామి పేరుతో బాహుబలికి ముందు జరిగే కథను నవలగా విడుదల చేశారు. ఇప్పటికే బాహుబలి థీమ్‌తో వచ్చిన కామిక్‌ బుక్స్‌, ఏనిమేషన్‌ సిరీస్‌, మర్చెంట్‌ డైస్‌లకు మంచి ఆదరణ లభించటంతో ఆన్‌లైన్‌ సిరీస్‌ కూడా సక్సెస్‌ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు.

మరిన్ని వార్తలు