'పవన్ కోసం పవర్ ఫుల్ కథ రాస్తా'

14 May, 2017 10:39 IST|Sakshi
'పవన్ కోసం పవర్ ఫుల్ కథ రాస్తా'

బాహుబలి, భజరంగీ బాయ్ జాన్ సినిమాలతో జాతీయ స్థాయిలో స్టార్ రైటర్గా మారిపోయాడు రచయిత విజయేంద్ర ప్రసాద్. ప్రస్తుతం విజయ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాతో పాటు, బాలీవుడ్లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మణికర్ణిక సినిమాలకు విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్నారు. వీటితో పాటు బుల్లితెరపై భారీ బడ్జెట్తో రూపొందిస్తున్న ఆరంబ్ టీవీ సీరీస్కు కూడా ఆయనే కథ ఇస్తున్నారు.

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ రైటర్, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం కథ రెడీ చేయాలనుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, నిజాయితీ అంటే తనకెంతో ఇష్టమన్న విజయేంద్ర ప్రసాద్.. ఆ అంశాలతోనే ఆయన కోసం ఓ పవర్ ఫుల్ కథను రెడీ చేస్తానని తెలిపాడు. త్వరలోనే ఆ కథ రెడీ అయ్యే ఛాన్స్ ఉందంటూ పవన్ అభిమానుల్లో జోష్ నింపాడు. ప్రస్తుతం రాజమౌళి సినిమాలతో పాటు బయటి దర్శకులకూ కథలు అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్, పవన్ కోసం కథ రెడీ చేస్తే ఆ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి.