నువ్వంటే శబ్దం.. నేనంటే శాసనం

7 Dec, 2019 03:04 IST|Sakshi
బోయపాటి శ్రీను, బాలకృష్ణ, మిర్యాల రవీందర్‌రెడ్డి

‘నువ్వొక మాటంటే అది శబ్దం.. అదే మాట నేనంటే అది శాసనం’ అంటూ తన తాజా చిత్రం కోసం పవర్‌ఫుల్‌ డైలాగ్‌ను చెప్పారు బాలకృష్ణ. ‘సింహా, లెజెండ్‌’ లాంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేష¯Œ లో వస్తోన్న మూడో చిత్రానికి శుక్రవారం కొబ్బరికాయ కొట్టారు. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అంబికా కృష్ణ కెమెరా స్విచ్చా¯Œ  చేయగా, దర్శకుడు బి. గోపాల్‌ క్లాప్‌ ఇచ్చారు.

బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘బోయపాటి, నా కాంబినేషన్‌లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎక్కువ అంచనాలుంటాయి. గతం గతః అన్నది మా సిద్ధాంతం. మా గత సినిమాల గురించి మాట్లాడుకోకుండా పూర్తిగా ఈ సినిమాపైనే మా దృష్టి ఉంచుతాం. ఈ చిత్రంలో ఆధ్యాత్మికం కూడా ఉంటుంది’’ అన్నారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ– ‘‘భద్ర’ వంటి మంచి సినిమాతో ఇండస్ట్రీలో నా లైఫ్‌ స్టార్ట్‌ అయింది. ‘సింహా’ వంటి భారీ విజయంతో నా జీవితానికి మంచి మలుపు వచ్చింది.

‘సింహా, లెజెండ్‌’ చిత్రాలను మించిన మంచి సినిమాను మీ ముందుకు తీసుకొచ్చి నా బాధ్యతను నెరవేర్చుకుంటాను’’ అన్నారు. మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘భవిష్యత్తులో నేను చాలా సినిమాలు తీయొచ్చు. కానీ, బాలకృష్ణగారితో సినిమా అంటే గౌరవంగా భావిస్తా. ఆయన అభిమానులు, సినిమా ఇష్టపడే ప్రతి ఒక్కరి నుంచి అటువంటి గౌరవాన్ని పొందే విధంగా ఈ సినిమా నిర్మిస్తానని మాట ఇస్తున్నా’’ అన్నారు. ప్రారంభోత్సవ వేడుకలో నిర్మాతలు శివలెంక కృష్ణప్రసాద్, సి.కల్యాణ్, కెమెరామేన్‌ రాంప్రసాద్, రచయిత ఎం.రత్నం పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌ ఎస్‌.ఎస్‌.    

మరిన్ని వార్తలు