బాలయ్య దండయాత్ర..!

18 Aug, 2017 10:48 IST|Sakshi
బాలయ్య దండయాత్ర..!

నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పైసా వసూల్. ఈ కాంబినేషన్ లో సినిమా ప్రకటించిన దగ్గర నుంచే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. షూటింగ్ మొదలైన రోజే రిలీజ్ డేట్ ను ప్రకటించిన దర్శకుడు అంతకన్న నెల రోజుల ముందే సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. టీజర్ తో బాలయ్య అభిమానులను ఫుల్ ఖుషీ చేశాడు.

గురువారం జరిగిన ఆడియో వేడుకలో విడుదల చేసిన ట్రైలర్ వెంటనే హిట్ అయిపోయింది. బాలయ్య చెప్పిన డైలాగ్స్ మాస్ జనానికి పూనకాలు తెప్పిస్తున్నాయి. సినిమాలో బాలయ్య చెప్పే డైలాగ్స్ రిలీజ్ చేయాలంటే ఓ సీడీ సరిపోదంటూ హింట్ ఇచ్చిన దర్శకుడు, ట్రైలర్లోనే బాలయ్యతో పేజీల కొద్ది డైలాగ్స్ చెప్పించాడు. టీజర్ తోనే రికార్డ్ ల వేట మొదలు పెట్టిన బాలకృష్ణ, తాజాగా ట్రైలర్ తో దండయాత్ర చేస్తున్నాడు.

ఆన్‌లైన్‌లో రిలీజ్ అయిన 75 నిమిషాల్లోనే 5 లక్షలకు పైగా వ్యూస్ సాధించిన పైసా వసూల్ ట్రైలర్, కేవలం 4 గంటల్లోనే 10 లక్షల వ్యూస్ ను సాధించింది. బాలకృష్ణ సరసన శ్రియ, ముస్కాన్, కైరా దత్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కు రెడీ అవుతోంది.