రానాతో కలిసి బాలకృష్ణ మల్టీస్టారర్‌ మూవీ!

2 Apr, 2020 13:03 IST|Sakshi

టాలీవుడ్‌ పరిశ్రమలో ప్రస్తుతం మల్టీ స్టారర్‌ సినిమాల జోరు బాగానే నడుస్తోంది. అంతేగాకుండా మల్టీస్టారర్‌ సినిమాలు చేయడానికి టాప్‌ హీరోలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌ల్‌ మల్టీస్టారర్‌ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ కూడా దగ్గుబాటి రానాతో కలిసి మల్టీస్టారర్‌ మూవీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. మలయాళంలో సూపర్‌ హిట్‌ సాధించిన ‘అయ్యప్పనుమ్ కోసియుమ్' సినిమాను తెలుగు, తమిళ్‌ భాషల్లో రీమేక్‌ చేయబోతున్నారు. ఈ సినిమా తెలుగు రీమేక్‌ హక్కులను సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ కోనుగోలు చేసింది. (కరోనా: ట్రెండింగ్‌లో ఆర్జీవీ ‘పురుగు’ పాట!)

అయ్యప్పనుమ్ కోసియుమ్ సినిమా.. అయ్యప్పనుమ్‌ నాయర్ అనే పోలీస్‌ అధికారి, రిటైర్డ్‌ హవిల్దార్‌ కోషి కురియన్‌ మధ్య జరిగే ఈగో వార్‌ నేపథ్యంలో సాగే కథ. మలయాళంలో బిజు మీనన్‌, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొంది సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా తెలుగు రీమేక్‌లో బిజు మీనన్‌ పాత్ర కోసం చిత్ర నిర్మాతలు బాలకృష్ణను సంప్రదించినట్లు, ఇందుకు బాలయ్య కూడా సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే పృథ్విరాజ్‌ పాత్ర కోసం రానాను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. (బోయపాటి చిత్రంలో బాలయ్య లుక్‌.. అదుర్స్‌!)

ప్రస్తుతం రానా అరణ్య, విరాట పర్వం సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కాగా ఇప్పటికే బాలకృష్ణ, రానాలు కలిసి ‘ఎన్టీఆర్’ జీవితం ఆధారంగా వచ్చిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాల్లో కలిసి నటించారు. అంతేకాక రానా హోస్ట్ చేసిన నెంబర్ వన్ యారీ విత్ రానా కార్యక్రమంలో కూడా బాలయ్య సందడి చేసారు.  ఇపుడు మరోసారి వీళ్లిద్దరు కలిసి నటిస్తారా లేదా అనేది చూడాలి. (కరోనాతో మరో ప్రముఖ గాయకుడు మృతి)

మరిన్ని వార్తలు