-

ఈ సినిమాతో రోహిత్ పెద్ద ధైర్యమే చేశాడు - బాలకృష్ణ

5 Mar, 2016 23:10 IST|Sakshi
ఈ సినిమాతో రోహిత్ పెద్ద ధైర్యమే చేశాడు - బాలకృష్ణ

‘‘సావిత్రి అనే చక్కటి టైటిల్ పెట్టినందుకు ఆనందంగా ఉంది. నారా రోహిత్ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. సినిమా తీసే వాళ్లకు కథ తెలుస్తుంది. కానీ, టైటిల్‌ను బట్టి ప్రేక్షకులు సినిమాకు వస్తారు. ఈ టైటిల్ థియేటర్‌కి రప్పించే విధంగా ఉంది’’అని హీరో బాలకృష్ణ అన్నారు. నారా రోహిత్, నందిత జంటగా పవన్ సాదినేని దర్శకత్వంలో విజన్ ఫిలిం మేకర్స్ పతాకంపై వీబీ రాజేంద్రప్రసాద్ నిర్మించిన చిత్రం ‘సావిత్రి’.

శ్రవణ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను  హైదరాబాద్‌లో బాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ- ‘‘నారా రోహిత్ ఈ సినిమాలో పాట పాడాడని తెలిసింది. నాకు పాటలు పాడటం ఇష్టమే కానీ, నాతో ఎవరూ పాడించడం లేదు. పాట పాడి, ఈ సినిమాతో రోహిత్ పెద్ద ధైర్యమే చేశాడు’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా లేట్‌గా ప్రారంభమైనా మంచి నిర్మాత దొరకడంతో క్వాలిటీ ఔట్‌పుట్ వచ్చింది. ‘సోలో’ తర్వాత మళ్లీ అలాంటి సినిమా అవుతుంది’’ అని నారా రోహిత్ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఎలాంటి వల్గారిటీ లేకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నారా రోహిత్ ఫ్యాన్స్‌కు ఐ ఫీస్ట్ అవుతుంది’’ అని తెలిపారు. హీరో తారకరత్న, దర్శకుడు ప్రవీణ్ సత్తారు, నిర్మాత  సాయి కొర్రపాటి, కథానాయికలు శ్రద్ధాదాస్, రష్మీ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.