బాలయ్య వారసుడి ఎంట్రీ నిజమేనా?

2 May, 2016 21:47 IST|Sakshi
బాలయ్య వారసుడి ఎంట్రీ నిజమేనా?

నటరత్న బాలకృష్ణ వందో సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి' సంబంధించి తాజా వార్త ఒకటి సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సినిమాతో నందమూరి మూడోతరం వారసుడు, బాలయ్య తనయుడు 21 ఏళ్ల మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం అవుతారన్న కథనం టాలీవుడ్‌లో షికారు చేసింది.

జాతీయ అవార్డు గ్రహీత అయిన క్రిష్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'గౌతమిపుత్ర శాతకర్ణి'లో మోక్షజ్ఞ బాలకృష్ణ కొడుకు పాత్రలో కనిపిస్తారని కథనాలు వచ్చాయి. ఈ కథనాలు హల్‌చల్‌ చేస్తుండటంతో తాజాగా సినిమా యూనిట్‌ క్లారిటీ ఇచ్చింది. ఈ కథనాలు వట్టి వదంతులేనని తేల్చింది. ఈ సినిమాలో అసలు మోక్షజ్ఞను తీసుకోవాలని భావించలేదని, ఇందులో అతన్ని వారసుడిగా పరిచయం చేసేందుకు తగిన పాత్ర లేకపోవడమే ఇందుకు కారణమని చిత్రవర్గాలు తెలిపాయి. క్రీస్తుపూర్వం 1వ శతాబ్దానికి చెందిన శాతకర్ణి చక్రవర్తి పాత్ర చుట్టే కథ నడుస్తుందని, శాతకర్ణిగా నటిస్తున్న బాలయ్యపైనే కథ కేంద్రీకృతమై ఉంటుందని, కాబట్టి ఈ సినిమాలో మోక్షజ్ఞకు సరిపోయే కీలక పాత్రకు అవకాశం లేదని చిత్రవర్గాలు స్పష్టం చేశాయి.

దాదాపు రూ. 75 కోట్ల భారీ బడ్జెట్‌ తెరకెక్కుతున్నట్టు భావిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ నెల 9 నుంచి మొరాకోలో ప్రారంభం కానుంది. ఇక్కడ భారీ యుద్ధ ఘట్టాన్ని చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో హేమామాలిని, కబీర్ బేడి వంటి సీనియర్‌ నటులు నటిస్తుండగా, బాలయ్య సరసన కనిపించనున్న హీరోయిన్‌ను ఇంకా ఎంపిక చేయలేదు.