‘‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తర్వాత నా 101వ సినిమా గురించి చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఆధ్యాత్మిక చింతన ఉన్న ఆనంద్ ప్రసాద్గారి నిర్మాణంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. అభిమానులు, ప్రేక్షకులు కోరుకునేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది.
నందమూరి రామకృష్ణ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘ఎప్పటి నుంచో బాలకృష్ణగారితో సినిమా చేయాలనుకుంటున్నా. ఈ చిత్రంతో నా లక్ష్యం నెరవేరింది. బాలకృష్ణగారి నుంచి అభిమానులు ఏం కోరుకుంటారో ఆ విధంగా ఈ చిత్రం ఉంటుంది. ఆయన సై్టల్కు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రేక్షకులు కొత్త బాలయ్యను చూస్తారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 29న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. ఒకవేళ ముహూర్తం బాగుంటే ఒకట్రెండు రోజులు ముందుగానే విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘మా బ్యానర్లో 8వ చిత్రం బాలకృష్ణ, పూరి కాంబినేషన్లో చేయడం హ్యాపీగా ఉంది. ఇది మా బ్యానర్కు క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. ఈ నెల 16న రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం’’ అని నిర్మాత తెలిపారు. దర్శకులు బి.గోపాల్, కోదండరామి రెడ్డి, క్రిష్, హీరో నారా రోహిత్, నటుడు అలీ, మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా పాల్గొన్నారు.