'‘సింహా’ను మించే స్థాయిలో బాలయ్య పాత్ర'

31 Jul, 2013 22:23 IST|Sakshi
'‘సింహా’ను మించే స్థాయిలో బాలయ్య పాత్ర'

కెరీర్‌లో ఎన్నడూ తీసుకోనంత విరామం తీసుకుని ఎట్టకేలకూ కెమెరా ముందుకొచ్చారు బాలకృష్ణ. జూలై 13 నుంచి వేరే లేకుండా ఏకధాటిగా బోయపాటి శ్రీను సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారాయన. ఈ నెల 18 వరకూ ఈ భారీ షెడ్యూల్ ఉంటుందని సమాచారం. ప్రస్తుతం బాలయ్య, ఫైటర్స్‌పై రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు బోయపాటి. బ్లాక్‌బస్టర్ ‘సింహా’ తర్వాత వీర్దిదరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ప్రతిష్టాత్మకంగా భావించి బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని యూనిట్ వర్గాల భోగట్టా. ‘సింహా’ను మించే స్థాయిలో ఇందులో బాలయ్య పాత్ర చిత్రణ ఉంటుందని తెలుస్తోంది. కథ, కథనం, బాలకృష్ణ ఆహార్యం, సంభాషణలు, సంగీతం ఇలా... ప్రతి అంశం అభిమానుల్ని ఉర్రూతలూగించేలా ఉంటాయని వినికిడి. కథ రీత్యా ఇందులో ఇద్దరు కథానాయికలు.
 
రెండో హీరోయిన్‌గా సోనాల్ చౌహాన్‌ని ఇప్పటికే ఎంపిక చేశారు. మెయిన్ హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉంది. నయనతార ఈ పాత్ర పోషించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులో ఏ మాత్రం నిజం లేదని విశ్వసనీయ సమాచారం. త్వరలోనే ప్రధాన కథానాయికను ఎంపిక చేస్తారు. ఈ చిత్రానికి ‘జయసింహ’ అనే పేరు ప్రచారంలో ఉంది. ‘ఈగ’ నిర్మాత సాయి కొర్రపాటి సమర్పణలో ‘దూకుడు’ నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు. బాలయ్యకు దేవిశ్రీ స్వరాలందించడం ఇదే ప్రథమం. గీతాలే కాదు, నేపథ్య సంగీతం అందించడంలో దేవిశ్రీప్రసాద్ దిట్ట. మాస్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న బాలయ్య ఇమేజ్‌కి తగ్గట్టుగా ఏ స్థాయిలో దేవిశ్రీ రీ-రికార్డింగ్ అందిస్తారో చూడాలి.