‘బాలికా వధు ఫేం’ సిద్ధార్థ్‌ శుక్లాపై తీవ్ర ఆరోపణలు

24 Oct, 2019 11:39 IST|Sakshi

ముంబై : హిందీ బుల్లితెర నటి షీతల్‌ ఖందల్‌ తన సహ నటుడు సిద్ధార్థ్‌ శుక్లాపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. షూటింగ్‌ సమయాల్లో సిద్ధార్థ్‌ ​​​​తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించారు. వీరిద్దరు కలిసి హిందీలో బాగా పాపులర్‌ అయిన ‘బాలికా వధు’ సీరియలో నటించారు. హిందీలో దాదాపు 8 సంవత్సరాలపాటు కొనసాగిన ఈ సీరియల్‌ తెలుగులోనూ ‘చిన్నారి పెళ్లి కూతురు’గా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఆ సీరియల్‌లో గాయత్రి పాత్ర పోషించిన షీతల్‌ తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో... సిద్ధార్థ్‌ శుక్లాపై తీవ్ర ఆరోపణలు చేశారు. సిద్ధార్థ్ తనను సెట్లో అనేకసార్లు అనుచితంగా తాకాడని, లైంగికంగా వేధించాడని ఆరోపించారు. కాగా ప్రస్తుతం సిద్ధార్థ్‌ శుక్లా హిందీ బిగ్‌బాస్‌-13లో కంటెస్టెంట్‌గా ఉ‍న్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బిగ్‌బాస్‌లో ఆర్తిసింగ్‌పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సిద్ధార్థ్‌ డేకు వ్యతిరేకంగా సిద్ధార్థ్‌ శుక్లా మాట్లాడటం ఆశ్చర్యంగా తనకు ఉందన్నారు. వాస్తవంగా శుక్లా తనతో ప్రవర్తించిన తీరుతో పోలిస్తే ఆర్తితో సిద్ధార్థ్‌ డే మాట్లాడిన మాటలు చాలా తక్కువ అని పేర్కొన్నారు. 

షీతల్‌ మాట్లాడుతూ.. ‘‘సిద్ధార్థ్‌ షూటింగ్‌లో నాపై అసభ్యకరమైన జోకులు వేసేవాడు. నేను ఎవరితో పంచుకోలేని పదాలను సైతం నాపై ఉపయోగించాడు. తను నాతో అనుచితంగా ప్రవర్తించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకరోజు షూటింగ్‌లో అతను నన్ను తాకిన విధానం నాకు అసహ్యం కలిగించింది. నాకు అది మొదటి సీరియల్‌ కాబట్టి ఏం చేయలేకపోయాను. అయితే తరువాత చాలాసార్లు సీరియల్‌ నిర్మాతకు సిద్ధార్థ్‌పై ఫిర్యాదు చేశాను. అప్పటి నుంచి సిద్ధార్థ్‌ సెట్లో నాకు వ్యతిరేకంగా మట్లాడటం, నాపై అవమానకర వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడు. తనకు తాను గొప్ప వ్యక్తిగా అనుకునేవాడు. అంతేగాక తనకు వ్యతిరేకంగా మాట్లడిన వారందరితో కఠినంగా వ్యవహరించేవాడు. కానీ అతనికి వ్యతిరేకంగా వెళ్లే ధైర్యం ఎవరికీ లేకపోయింది’’ అని చెప్పుకొచ్చారు.

చదవండి: దర్శకుడిపై హీరోయిన్‌ ఫిర్యాదు

>
మరిన్ని వార్తలు