గిల్డ్‌ పేరుతో డబ్బు వసూళ్లపై నిషేదం

31 Jul, 2019 11:37 IST|Sakshi

దక్షిణ భారత సినీ, టీవీ నిర్మాతల మండలి(గిల్డ్‌) పేరుతో సభ్యుల నుంచి, బ్యాంకు నుంచి డబ్బును వసూల్‌ చేయడంపై మద్రాసు హైకోర్టు నిషేధం విధించింది. వివరాల్లోకి వెళితే దక్షిణ భారత సినీ, టీవీ నిర్మాతల మండలికి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న స్టంట్‌మాస్టర్‌ జాగ్వర్‌ తంగం మద్రాసు హైకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేశారు.

అందులో తాను అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్న దక్షిణ భారత సినీ, టీవీ నిర్మాతల మండలికి బదులుగా బాల సుబ్రమణియం అనే వ్యక్తి నకిలీ సంఘాన్ని ఏర్పాటు చేసి సభ్యుల వద్ద డబ్బును వసూల్‌ చేసి మోసానికి పాల్పడడంతో పాటు ఆ సంఘం నుంచి తనను తొలగించినట్లు ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. నిజానికి తమ సంఘం దక్షిణ చెన్నై సంఘాల రిజిస్టర్‌ కార్యాలయంలో నమోదైందని తెలిపారు.

అలాంటిది బాలసుబ్రమణియన్‌ వర్గం నకిలీ సంఘాన్ని ప్రారంభించి మోసాలకు పాల్పడుతోందని తెలిపారు. అంతే కాకుండా స్థానిక వడపళనిలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంకులో తమ సంఘం పేరుతో ఉన్న ఖాతా నుంచి డబ్బును వసూలు చేస్తున్నారని తెలిపారు. కాబట్టి వారి నకిలీ సంఘంపైనా, అదే విధంగా బ్యాంకులో డబ్బును వసూలు చేకుండా నిషేధించాలని కోరారు. ఈ పిటిషన్‌పై సోమవారం కోర్టులో విచారణ జరిగింది.

పిటిషనుదారుడి తరఫున న్యాయవాది ఆర్‌.మహేశ్వరి హాజరై తన వాదనలను వినిపించారు. అనంతరం న్యాయమూర్తులు కృష్ణన్‌ రామస్వామి నకిలీ సంఘం పేరుతో సభ్యుల నుంచి ఎలాంటి డబ్బును వసూలు చేయరాదని,  అదే విధంగా యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి ఎలాంటి లావాదేవీలు జరపరాదని ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా బాలసుబ్రమణియంను వచ్చే నెల 9వ తేదీలోగా ఈ వ్యవహారంపై బదులు పిటిషన్‌ను దాఖలు చేయాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు