ఏదో తెలిసో.. తెలియకో టంగ్‌ స్లిప్పై..

6 Jan, 2020 11:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకలో సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తనదైన శైలిలో ప్రసంగిస్తూ నవ్వులు కురిపించాడు. ఈ సినిమాలో తాను బ్లేడ్‌ గణేష్‌ పాత్ర పోషించానని, కానీ, ఈ సినిమా తర్వాత దయచేసి ఎవరూ తనను బ్లేడ్‌ గణేష్‌ అని పిలువద్దని వేడుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ గెలువకపోతే బ్లేడుతో గొంతు కోసుకుంటానని ప్రకటించి అప్పట్లో బండ్ల గణేష్‌ సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

దీనిపై పరోక్షంగా స్పందిస్తూ.. ‘ఏదో తెలిసో తెలియకో టంగ్‌ స్లిప్‌ అయ్యాను.  అందరూ కలిసి ఎర్రీ బీప్‌ అంటున్నారు కాబట్టి.. బండ్ల గణేష్‌గానే మీ అందరి ముందు ఉండాలని కోరుకుంటున్నా. ఈ సినిమాలో పది నిమిషాలు నేనుకూడా చింపేసా. ఇకముందు కూడా సినిమాల్లో యాక్ట్‌ చేస్తా.  సినిమాలు తీస్తా. సినిమానే నా జీవితం. ఇంకా వేరేవాటితో నాకు సంబంధం లేదు. అమ్మతోడు.. 30 ఏళ్ల నుంచి సినిమాల్లోనే ఉన్నాను. ఇంకో 30 ఏళ్లూ ఇక్కడే ఉంటాను’అని చెప్పుకొచ్చారు.

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సినిమా ఈవెంట్‌కు చిరంజీవి రావడం ఆయన సంస్కారానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. మహేశ్‌, చిరు అన్నదమ్ములుగా నటిస్తే చూడాలని ఉందన్నారు. చిరంజీవి మళ్లీ యాక్ట్‌చేయాలని బలంగా కోరుకున్నది తానేనని, ​కానీ ఆయన ఇప్పుడు తనను మరిచిపోయి అన్ని సినిమాలు వాళ్ల అబ్బాయికే చేస్తున్నారని సరదాగా వ్యాఖ్యానించారు.  అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు తీసిన ఈ సినిమా రూ. 250 కోట్లు కలెక్ట్‌చేయాలని, అన్ని రికార్డులు చెరిపేయాలని కోరుకున్నారు.

మరిన్ని వార్తలు