ఉదయం ఆట ఉచితం

19 Nov, 2019 03:11 IST|Sakshi
చేతన్‌ మద్దినేని

‘రోజులు మారాయి, గల్ఫ్, ఫస్ట్‌ర్యాంక్‌ రాజు’ చిత్రాల్లో హీరోగా నటించిన చేతన్‌ మద్దినేని తొలిసారి దర్శకత్వం వహించి, నిర్మించిన చిత్రం ‘బీచ్‌ రోడ్‌ చేతన్‌’. తేజారెడ్డి కథానాయికగా నటించారు. చేతన్‌ మద్దినేని ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. హీరో–దర్శక–నిర్మాత– చేతన్‌ మద్దినేని మాట్లాడుతూ– ‘‘ఒక ప్రయోగాత్మకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. టీజర్‌ అందరికీ నచ్చింది. ట్రైలర్‌కి కూడా మంచి స్పందన లభిస్తోంది. మా సినిమా మొదటి రోజు మొదటి ఆట టికెట్స్‌ని ఏపీ, తెలంగాణలో ప్రేక్షకులకు ఉచితంగా ఇస్తున్నాం.

దాదాపు 200 థియేటర్స్‌లో మా సినిమా విడుదల కాబోతోంది. మొదటి ఆట నుంచి మా చిత్రానికి పాజిటివ్‌ టాక్‌ వస్తుందని భావిస్తున్నా’’ అన్నారు. ‘‘అందరికీ కల ఉంటుంది. వాటిని సాకారం చేసుకోవాలంటే సరైన వ్యక్తి కావాలి. ఈ సినిమాలో విలన్‌గా నాకు మంచి పాత్ర ఇచ్చారు చేతన్‌. ఎంజాయ్‌ చేస్తూ ఈ సినిమా చేశాం.. ప్రేక్షకులు కూడా ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు నటుడు నిర్మల్‌ భాను. ‘‘150 మంది కొత్త నటీనటులు ఈ సినిమాలో నటించారు. అందరూ బాగా చేశారు’’ అన్నారు కో డైరెక్టర్‌ ఈశ్వర్‌. ఈ చిత్రానికి కెమెరా: నిశాంత్‌ రెడ్డి, సంగీతం: శామ్యుల్‌ జె. బెనయ్య.

మరిన్ని వార్తలు