కెమేరా వెనుక కొత్త అవతారం

6 Aug, 2014 23:06 IST|Sakshi
కెమేరా వెనుక కొత్త అవతారం

కొన్నేళ్ళ క్రితం ‘కొత్త బంగారు లోకం’ చిత్రంలో హీరో వరుణ్ సందేశ్ సరసన మెరిసిన కథానాయిక శ్వేతాబసు ప్రసాద్ గుర్తుందిగా! తొలి చిత్రంతోనే అనూహ్యమైన గుర్తింపు సాధించిన ఈ యువ నటి ఆ తరువాత ఆశించిన మేరకు విజయాలు అందుకోక బాగా వెనుకబడ్డారు. ప్రత్యేక నృత్య గీతాల్లోనూ నర్తించారు. అయితే, ఇప్పుడీ నవతరం అమ్మాయి ఓ డాక్యుమెంటరీని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ‘రూట్స్’ అని పేరు పెట్టిన ఈ డాక్యుమెంటరీ చిత్రం భారతీయ శాస్త్రీయ సంగీతంపై తీసినది కావడం విశేషం. మూడేళ్ళు పట్టిన ఈ డాక్యుమెంటరీ కోసం చిత్రీకరణకు ముందు విస్తృతంగా పరిశోధన చేసినట్లు శ్వేతాబసు చెబుతున్నారు.

‘‘2011 మే నెలలో నాకు 20 ఏళ్ళ వయసులో ఈ డాక్యుమెంటరీ చిత్ర రూపకల్పన మొదలుపెట్టాను. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ మొత్తం ప్రయాణాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను’’ అని ఆమె అన్నారు. ఇటు కర్ణాటక సంగీతం, అటు హిందుస్థానీ సంగీతం - రెండూ ఇవాళ భారతీయ యువతరంలో ఏ మేరకు నిలిచాయన్న అంశం ఆధారంగా ఈ ‘రూట్స్’ తీశారు. ఇందులో విశాల్ భరద్వాజ్, ఏ.ఆర్. రెహమాన్, శుభా ముద్గల్, ఇమ్తియాజ్ అలీ, పండిట్ హరిప్రసాద్ చౌరసియా లాంటి సుప్రసిద్ధుల ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఈ డాక్యుమెంటరీని దేశవిదేశాల్లోని చలనచిత్రోత్సవాల్లోనే కాక, పాఠశాలలు, ఇతర విద్యా సంస్థల్లో సైతం ప్రదర్శించాలని భావిస్తున్నారు. మరి, ఈ ప్రయత్నంలోనైనా శ్వేతాబసు సక్సెస్ అవుతారా?