వారణాసిలో డిష్యుం డిష్యుం

21 Sep, 2017 23:41 IST|Sakshi

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్‌ దర్శకత్వంలో ఓ డిఫరెంట్‌ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై అభిషేక్‌ నామా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం వారణాసిలో జరుగుతోంది. ఈ సందర్భంగా అభిషేక్‌ నామా మాట్లాడుతూ– ‘‘శ్రీవాస్‌ చాలా సమయం వెచ్చించి, ఈ కథ సిద్ధం చేశారు. హైదరాబాద్, పొలాచ్చిలో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు అబ్బురపరిచే యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించాం.

శివుని ఆశీస్సులతో పీటర్‌ హెయిన్‌ సారధ్యంలో కాశీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నవరాత్రి ఉత్సవాల్లో యాక్షన్‌ సీన్స్‌ తీస్తున్నాం. బలమైన కథ, కథనాలతో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న మా సినిమా 50 శాతం పూర్తయ్యింది’’ అన్నారు. జగపతిబాబు, శరత్‌ కుమార్, మీనా, ‘వెన్నెల’ కిశోర్, రవికిషన్, అశుతోష్‌ రాణా, లావణ్య, జయప్రకాశ్, పవిత్రా లోకేష్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్ధర్‌ ఎ. విల్సన్, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా.