సృష్టే సాక్ష్యంగా...

18 Jul, 2018 00:32 IST|Sakshi

ఈ భూమ్మీద జరిగే ప్రతిదానికి సాక్ష్యం ఈ దృష్టే కాదు. ఆ సృష్టి కూడా. ఇలా సృష్టే సాక్ష్యంగా నిలిచిన ఓ సంఘటన కోసం ఓ కుర్రాడు పోరాడుతున్నాడు. అతని పోరాటానికి పంచభూతాలు (గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం) ఎలా సాయం చేసాయన్నది థియేటర్‌లో చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటున్నారు ‘సాక్ష్యం’ టీమ్‌. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా  శ్రీవాస్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సాక్ష్యం’. అభిషేక్‌ నామా నిర్మించిన ఈ సినిమాకు హర్షవర్థన్‌ రామేశ్వర్‌ సంగీతం అందించారు.

‘‘ఇటీవల విడుదలైన ట్రైలర్, ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది. కర్మ సిద్ధాంతం నేపథ్యంలో మనిషి చేసిన తప్పులకు ప్రకృతి ఎలా సాక్ష్యంగా నిలిచింది అన్న అంశం సినిమాలో స్పెషల్‌ ఎట్రాక్షన్‌. అభిషేక్‌ నామా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి కావొచ్చాయి. సినిమాను ఈ నెల 27న విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. శరత్‌ కుమార్, మీనా, జగపతిబాబు, రవికిషన్, అశుతోష్‌ రాణా, జయప్రకాశ్, ‘వెన్నల’ కిశోర్‌ నటించిన ఈ చిత్రానికి మాటలు: సాయి మాధవ్‌ బుర్రా. 

మరిన్ని వార్తలు