వారికి శిక్ష పడే వరకు సినిమాల్లో నటించను

24 Feb, 2017 02:53 IST|Sakshi
వారికి శిక్ష పడే వరకు సినిమాల్లో నటించను

నేరస్తులకు శిక్ష పడే వరకు నేను సినిమాల్లో నటించనని నటి భావన శపథం చేశారు. తన మాజీ కారు డ్రైవర్‌ సహా ఆరుగురు నటి భావనను కిడ్నాప్‌నకు పాల్పడిన సంఘటన దక్షిణాది చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. నటి స్నేహ సహా పలువురు నటీమణులు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. భావన కిడ్నాప్‌ సంఘటన గురించి పోలీసుల విచారణలో పలు ఆసక్తికరవైున అంశాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసులు ఇప్పటికే కిడ్నాప్‌నకు పాల్లడ్డ వ్యక్తుల్లో నలుగురిని అరెస్ట్‌ చేశారు. వారి సెల్‌ఫోన్ల ద్వారా భావన కిడ్నాప్‌ సంఘటనలో ఒక ప్రముఖ నటుడు, ఒక రాజకీయనాయకుడి ఇద్దరు కొడుకులు వారితో పలుమార్లు మాట్లాడినట్లు, నేరస్థుల వాగ్మూలంలో ఈ సంఘటనకు రూ.50 లక్షలు బేరం జరిగినట్లు బయట పడింది.

ఈ వ్యవహారంలో ఓ మలయాళ నటుడు ప్రమేయం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నటి భావన కిడ్నాప్‌ కేసులో తనకెలాంటి సంబంధం లేదని అతను స్పష్టం చేశారు. అయితే ఆ మళయాళ నటుడి మాజీ భార్యకు నటి భావనకు మధ్య మంచి స్నేహసంబంధాలున్నాయి. భర్తతో తనకు ఎదురైన చేదు అనుభవాలను భావనతో పంచుకున్నారని, భావన ఈ విషయాలను ప్రముఖ నటులకు, కొందరు రాజకీయనాయకుల దృష్టికి తీసుకెళ్లి ఆమెకు న్యాయం జరిగేలా పోరాడినట్లు ప్రచారం జరిగింది. దీంతో 2014 తరువాత ఆమెకు మలయాళంలో అవకాశాలు లేవు.

దీంతో కన్నడ చిత్ర పరిశ్రమపై దృష్టి సారించిన భావన అక్కడ నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు.దీంతో మళ్లీ మలయాళంలో అవకాశాలు రావడం మొదలెట్టాయి. ప్రస్తుతం నటుడు పృథ్వీరాజ్‌కు జంటగా ఒక చిత్రంలో నటించాల్సి ఉంది. అయితే తనను కిడ్నాప్‌ చేసిన దోషులకు తగిన శిక్ష పడేవరకూ తాను సినిమాల్లో నటించనని భావన శపథం చేసినట్లు నటుడు పృథ్వీరాజ్‌ తెలిపారు. ఇదిలా ఉండగా నటి భావనను లైంగికంగా వేధించిన దృశ్యాలను సెల్‌ఫోన్ లో చిత్రీకరించిన వ్యక్తులు వాటిని బయట పెట్టకుండా ఉండాలంటే రూ. 30 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం.