మార్చి 6న ‘ఓ పిట్ట కథ’

15 Feb, 2020 19:11 IST|Sakshi

చెందు ముద్దు దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ఓ పిట్ట కథ’. విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వి. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మాత. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, టీజర్‌లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే విడుదల చేసిన ‘ఏమై పోతానే’అంటూ సాగే లవ్‌ సాంగ్‌ యూత్‌ హార్ట్‌ బీట్స్‌ను పెంచేస్తోంది. కాగా, ఈ సాంగ్‌ చిత్రీకరణలో ఓ ఆసక్తికర విషయాన్ని నిర్మాత ఆనంద్‌ ప్రసాద్‌ మీడియాకు వెల్లడించారు.
 
‘ఈ పాటను అమలాపురం, కాకినాడ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాం. పాట చిత్రీకరణలో ఓ తమాషా ఉంది. మూవీలో సన్నివేశం మూడ్‌కు తగ్గట్టుగా అక్కడ లోకేషన్లలో విజువల్స్‌ని తెరకెక్కించాం. తొలుత విజువల్స్‌ షూట్‌ చేశాకే హైదరాబాద్‌లో ట్యూన్‌ కట్టాం. ఇలా ఇంతకుముందు ప్రముఖ దర్శకుడు వంశీ ‘లేడీస్‌ టైలర్‌’ కోసం ‘ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే’ పాటలో ఈ ప్రయోగం చేశారు. విజువల్స్‌ షూట్‌ చేసాకే ఇళయరాజాతో ఆ బాణీని సిద్దం చేయించారు దర్శకుడు. ఆ తరహాలోనే మేం చేసిన ప్రయోగం అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం. మార్చి 6న సినిమాను రిలీజ్‌ చేస్తున్నాం’అని నిర్మాత ఆనంద్‌ ప్రసాద్‌ తెలిపారు. 

అనంతరం దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ.. ‘ఒక విలేజ్‌లో జరిగే క‌థ‌ ఇది. ప్రతి సన్నివేశం కడుపుబ్బ నవ్విస్తూనే.. ఏం జరుగుతోందో అనే ఉత్కంఠను క‌లిగిస్తుంది. పతాకసన్నివేశాల వరకూ అదే థ్రిల్ కొన‌సాగుతుంది. ట్విస్టులు థ్రిల్‌ కలిగిస్తాయి. స్క్రీన్‌ ప్లే  ప్రధానంగా తెరకెక్కించాం’ అని అన్నారు. బాలరాజు, శ్రీనివాస్‌ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్‌ లక్కరాజు సంగీతమందిస్తున్నాడు.
 

చదవండి:
బుట్ట బొమ్మ చేతుల మీదుగా ‘ఏమైపోతానే’
‘సామజవరగమన’ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌​​​​​​​

మరిన్ని వార్తలు