మెగా వారసుల్లో మినిమమ్ గ్యారెంటీ స్టార్గా పేరు తెచ్చుకుంటున్నాడు యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్తో సత్తా చాటిన సాయి, ఇప్పుడు తన మార్కెట్ రేంజ్ను మరింత పెంచుకునే పనిలో పడ్డాడు. గత సినిమాలతో 20 కోట్ల వరకు షేర్ సాధించిన ఈ యంగ్ హీరో నెక్ట్స్ సినిమాతో మరో అడుగు ముందుకేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా సినిమా బడ్జెట్ కూడా భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు.
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో విన్నర్ సినిమాలో నటిస్తున్నాడు సాయిధరమ్ తేజ్. ప్రస్తుతం మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సరసన బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్, ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. స్టైలిష్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను టర్కీ, ఉక్రేయిన్ లాంటి దేశాల్లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో స్టార్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు సాయి ధరమ్తేజ్.