శ్రీమంతుడు మహేశ్‌బాబుకు ఊరట

2 Mar, 2017 20:46 IST|Sakshi
శ్రీమంతుడు మహేశ్‌బాబుకు ఊరట

సాక్షి, హైదరాబాద్‌:
శ్రీమంతుడు సినిమా నిర్మాణంలో కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారంటూ దాఖలైన కేసులో సినీ నటుడు మహేశ్ బాబు, ఆ చిత్ర దర్శకుడు కొరటాల శివలకు హైకోర్టులో ఊరట లభించింది. శ్రీమంతుడు సినిమా విషయంలో కాపీ రైట్‌ చట్టాన్ని ఉల్లంఘించారని, వారికి సమన్లు జారీ చేస్తూ నాంపల్లి కోర్టు ఈ ఏడాది జనవరి 24న జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ అంబటి శంకర నారాయణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

స్వాతి మాస పత్రికకు 2012లో తాను రాసిన చచ్చేంత ప్రేమ నవలను కాపీ చేసి శ్రీమంతుడు సినిమాను రూపొందించారని, తన అనుమతి లేకుండా తన కథ ఆధారంగా సినిమా నిర్మించి కాపీ రైట్‌ ఉల్లంఘనలకు పాల్పడినందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ రచయిత ఆర్‌డీ విల్సన్‌ అలియాస్‌ శరత్‌ చంద్ర నాంపల్లి కోర్టులో కేసు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన మొదటి అదనపు ఎంఎస్‌జే కోర్టు, హీరో మహేశ్‌ బాబు, దర్శకుడు కొరటాల శివ తదితరులకు సమన్లు జారీ చేస్తూ జనవరి 24న ఉత్తర్వులిచ్చింది.

ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, కొరటాల శివ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్‌ శంకర నారాయణ విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి కింది కోర్టు జారీ చేసిన సమన్ల అమలును నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.