బిగ్‌బాస్‌: టైటిల్‌ గెలుచుకుంది అతడే

16 Feb, 2020 10:48 IST|Sakshi

బిగ్‌బాస్‌ 13 హిందీ గ్రాండ్‌ఫినాలే ఎంతో ఘనంగా ముగిసింది. పార్టిసిపెంట్ల డ్యాన్సులు, కామెడీ స్కిట్లతో ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా కొనసాగింది. ఇక దీనికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సల్మాన్‌ ఖాన్‌ తన పాటలకు స్టెప్పులేయడంతో ప్రేక్షకుల ఈలలతో స్టేజీ దద్దరిల్లిపోయింది. ఇక ముందుగా ఊహించినట్టుగానే సిద్ధార్థ్‌ శుక్లా బిగ్‌బాస్‌ ట్రోఫీని ఎగరేసుకుపోయాడు. దీంతో పాటు రూ.40 లక్షల ప్రైజ్‌మనీ, లగ్జరీ కారును సొంతం చేసుకున్నాడు. అసిమ్‌ రన్నరప్‌గా సరిపెట్టుకున్నాడు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ షోలో కామెడీ కింగ్‌ సునీల్‌ గ్రోవర్‌, భారత క్రికెటర్లు హర్భజన్‌ సింగ్‌, మహ్మద్‌ కైఫ్‌ ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు.(బిగ్‌బాస్‌: తక్కువ ఓట్లు.. ఐనా అతడే విన్నర్‌!)

ముందే తప్పుకున్న పరాస్‌
ఆరుగురు కంటెస్టెంట్లు ఆర్తి సింగ్‌, రష్మీ దేశాయ్‌, షెహనాజ్‌ గిల్‌, పారాస్‌, సిద్ధార్థ్‌ శుక్లా, అసిమ్‌లు ఫైనల్‌కు చేరుకున్నారు. వీరికి సల్మాన్‌ బంఫర్‌ ఆఫర్‌ ప్రకటించాడు. తాము గెలుస్తామన్న నమ్మకం లేని వారు రూ.10 లక్షలు తీసుకొని షో నుంచి వైదొలగవచ్చని సూచించాడు. దీంతో పరాస్‌ ముందుగా బజర్‌ నొక్కి ఆ డబ్బును తీసుకొని తొలుత వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత ఆర్తి సింగ్‌, రష్మీ దేశాయ్‌, షెహనాజ్‌ గిల్‌ ఒక్కొక్కరుగా ఎలిమినేట్‌ అయ్యారు. చిట్టచివరగా అసిమ్‌, సిద్ధార్థ్‌ ఫైనల్‌ ట్రోఫీ కోసం నువ్వా నేనా అన్న రీతిలో పోరాడారు. అయితే పలు సర్వేల జోస్యమే నిజం కాగా విజయం సిద్ధార్థ్‌నే వరించింది.

ఇద్దరు ఫైనలిస్టులను స్టేజీపైకి ఆహ్వానించిన సల్మాన్‌.. సిద్ధార్థ్‌ గెలిచాడంటూ అతని చేయి పైకెత్తి విజయాన్ని ప్రకటించాడు. దీంతో సిద్ధార్థ్‌ అభిమానులు విజయానందంలో మునిగి తేలుతున్నారు. ఇక విన్నర్‌ కాకుండా మిగిలిన నలుగురికి అబుదాబీలోని అడ్వెంచర్‌ పార్క్‌ను సందర్శించే అవకాశాన్ని కల్పించాడు. బిగ్‌బాస్‌ 13 అన్ని సీజన్‌లోకెల్లా అత్యంత వివాదాస్పదమైన సీజన్‌ అని సల్మాన్‌ చెప్పుకొచ్చాడు. నేటి నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌ ఉండదంటూ పార్టిసిపెంట్లు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ చివరి ఎపిసోడ్‌లో సల్మాన్‌ హర్భజన్‌, మహ్మద్‌లతో స్టేజీపైనే క్రికెట్‌ ఆడటం ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. తిరిగి ఏడు నెలల్లోనే బిగ్‌బాస్‌ 14తో మళ్లీ వస్తానంటూ సల్లూభాయ్‌ వీడ్కోలు తీసుకున్నాడు. (బిగ్‌బాస్‌ షోపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు