బిగ్‌బాస్‌ : ఫినాలే సమరం; మరొకరు ఎలిమినేటెడ్‌

27 Oct, 2019 22:58 IST|Sakshi

దీపావళీ సందర్భంగా కంటెస్టెంట్లకు బిగ్‌బాస్‌ బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. హీరో విజయ్‌ దేవరకొండను చీఫ్‌ గెస్ట్‌గా కన్‌ఫెషన్‌ రూమ్‌లో పెట్టి వారితో ఓ ఆట ఆడుకున్నాడు. ఒక్కొక్కరినీ కన్‌ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచి.. బిగ్‌బాస్‌ ప్రయాణంలో ఇంతవరకూ ఎవరికీ చెప్పుకోని రహస్యాన్ని తనతో షేర్‌ చేసుకోవాలని చెప్పాడు. తొలుత శ్రీముఖి, తర్వాత బాబా భాస్కర్‌, అలీ రెజా, శివజ్యోతి, చివరగా వరుణ్‌ ఒక్కొక్కరూ విజయ్‌ దేవరకొండను కలుసుకున్నారు. తనతో షేర్‌ చేసుకున్న సీక్రెట్స్‌ ఎవరితో చెప్పనని విజయ్‌ వారికి మాటిచ్చాడు. అయితే, ఎవరూ చెప్పుకోదగ్గ రహస్యాలు పంచుకోలేదు. రాహుల్‌ మాత్రం పునర్నవి తన చేయి కొరికిన సందర్భాన్ని గుర్తు చేశాడు. ఇదిలా ఉండగా.. కన్‌ఫెషన్‌ రూమ్‌లోకొచ్చిన ప్రతి కంటెస్టెంట్‌కు విజయ్‌ తలా ఒక బెలూన్‌ ఇచ్చాడు. వాటిల్లో ఒక రహస్యం ఉందని చెప్పాడు. హోస్ట్‌ నాగార్జున అందులోని సీక్రెట్‌ బయటపెడ్తారని హౌజ్‌లోకి పంపించాడు.

అందరితో ‘రహస్య భేటీ’ పూర్తయిన తర్వాత విజయ్‌ బిగ్‌బాస్‌ వేదికపైకొచ్చి హోస్ట్‌ నాగార్జునను కలుసుకున్నాడు. ఈ సందర్భంగా పెళ్లిచూపులు ఫేమ్‌ తరుణ్‌ భాస్కర్‌ హీరోగా విజయ్‌ దేవరకొండ నిర్మించిన ‘మీకు మాత్రమే చెప్తా’ టీం సభ్యులు కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులను పలుకరించారు. దాంతోపాటు ఈ సినిమా ట్రైలర్‌ను బిగ్‌బాస్‌ హౌజ్‌లో మరోసారి ప్రదర్శించారు. ‘మీకు మాత్రమే చెప్తా’ నవంబర్‌ 1న విడుదలవుతుందని విజయ్‌ చెప్పాడు. సినిమాను ఆదరించండని బిగ్‌బాస్‌ వేదికగా ప్రేక్షకులను కోరాడు. 

ఇక చివరగా ఎలిమినేషన్‌ ప్రక్రియ మొదలైంది. కన్‌ఫెషన్‌ రూమ్‌లో విజయ్‌ ఇచ్చిన బెలూన్లను పగులగొట్టాలని హోస్ట్‌ నాగార్జున సూచించాడు. అందరి బెలూన్లలో ఎలాంటి విశేషం కనబడలేదు. అయితే, విజయ్‌ తనకిచ్చిన బెలూన్‌ ఎక్కడో మిస్‌ అయిందని వరుణ్‌ తెలపడంతో.. నాగ్‌ ఆ బెలూన్‌ను వెతికి తెప్పించి విజయ్‌ని పగులగొట్టమన్నాడు. బెలూన్‌ నుంచి ఒక స్లిప్‌ బయటపడింది. ఆ స్లిప్‌ను నాగ్‌ ఓపెన్‌చేసి.. విజయ్‌ చేతికివ్వగా.. వరుణ్‌ సేవ్‌ అయినట్టు అతను ప్రకటించాడు.

ఇక ఎపిసోడ్‌ చివరలో.. అసలైన ట్విస్ట్‌ మొదలైంది. అలీ రెజా, శివజ్యోతి ఇద్దరిలో ఎవరు సేవ్‌ అయ్యారో.. ఎవరు ఎలిమినేట్‌ అయ్యారో చెప్పేందుకు నాగ్‌ సస్పెన్స్‌ క్రియేట్‌ చేశాడు. బోర్డుపై BIG BOSS అని ఉన్న అక్షరాలను తెరచి చూపిస్తూ.. అక్షరాల వెనక ఎవరి ఫొటో ఉంటుందో వారు ఎలిమినేట్‌ అవుతారని చెప్పాడు. అనంతరం ఒక్కొక్క అక్షరాన్ని తిప్పి చూశాడు. అయితే, అక్షరాలు అయిపోవస్తున్నా..ఎవరి ఫొటో రాలేదు. ఇక చివరగా.. రెండక్షరాలు మాత్రమే మిగిలాయి. వాటిలోని మొదటి అక్షరం వెనక శివజ్యోతి ఫొటో బయటపడింది. దాంతో హౌజ్‌ నుంచి శివజ్యోతి ఎలిమినేట్‌ అయినట్టు నాగార్జున ప్రకటించాడు. అలీరెజా సేవ్‌ అయ్యాడని అందరూ అనుకుంటుండగా నాగ్‌ బాంబు పేల్చాడు. టాప్‌ 5 కాకుండా.. టాప్‌ 4 కూడా ఉండే అవకాశం ఉందని, ఈ వారం ఇద్దరు ఎలిమినేట్‌ అయినా కావొచ్చునని అన్నాడు. దీంతో టెన్షన్‌ మరింత రెట్టింపైంది. ఇక చివరి అక్షరం తెరచి చూడగా.. దానిపై అలీ ఫొటో లేదు. దీంతో అతను టాప్‌ 5లో చోటు దక్కించుకున్నట్టు నాగార్జున ప్రకటించాడు.

మరిన్ని వార్తలు