ఇంటిసభ్యుల లొల్లి.. పనిష్మెంట్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌!

15 Oct, 2019 15:30 IST|Sakshi

బిగ్‌బాస్‌ ఇంట్లో పన్నెండోవారం ముగిసింది. మహేశ్‌ విట్టా ఎలిమినేట్‌ అవటంతో ప్రస్తుతం ఇంటి సభ్యుల సంఖ్య ఏడుకు చేరింది. కాగా పదమూడోవారానికిగానూ జరిపిన నామినేషన్‌ ప్రక్రియ ‘టాపర్‌ ఆఫ్‌ ద హౌస్‌’ ఇంట్లో బీభత్సాన్ని సృష్టించింది. టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు.. వారు తీసుకున్న చిట్టీలో ఉన్న నెంబర్ల స్థానంలో నిలబడాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. అయితే వారు చర్చలు జరుపుకుని తమతమ స్థానాలను మార్చుకునే అవకాశాన్ని ఇచ్చాడు. బజర్‌ మోగిన తర్వాత చివరి నాలుగు స్థానాల్లో ఉన్నవారు నామినేట్‌ అవుతారని ప్రకటించాడు. మొదటగా.. బాబా భాస్కర్‌, రాహుల్‌, వరుణ్‌, అలీ రెజా, శివజ్యోతి, వితిక, శ్రీముఖిలు వరుసగా 1 నుంచి ఏడు స్థానాల్లో నిలబడ్డారు. అనంతరం ఎందుకు టాప్‌ స్థానాల్లో ఉండాలనుకుంటున్నారో చెపుతూ ఇంటి సభ్యులు ఒకరిపై ఒకరు అరుచుకున్నారు.

మొదట శ్రీముఖి.. రాహుల్‌పై ఫైర్‌ అయింది. ‘నువ్వు బాగా ఆడిన టాస్క్‌ ఒక్కటి చెప్పు’ అంటూ రాహుల్‌ను ప్రశ్నించింది. ‘అసలు నువ్వు ఏ టాస్క్‌ ఆడినవ్‌’ అంటూ రాహుల్‌.. శ్రీముఖికి ఎదురు తిరిగాడు. దీంతో చర్చ కాస్త రచ్చరచ్చగా మారింది. ఇక శ్రీముఖి.. రాహుల్‌తో పెట్టుకుంటే అయ్యే పని కాదని వదిలేసి బాబాను కాకాపట్టడానికి వెళ్లింది. అయితే అప్పటికే శ్రీముఖికి తన స్థానాన్ని ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్న బాబా తన మొదటి స్థానాన్ని ఆమెకు కట్టబెట్టి వెళ్లి ఆఖరి స్థానంలో నిలుచున్నాడు. రాహుల్‌.. తనకన్నా అలీ బెస్ట్‌గా పర్‌ఫార్మ్‌ చేస్తాడని ఒప్పుకుంటూ అతనికి రెండో స్థానాన్ని ధారధత్తం చేశాడు.

ఇక వరుణ్‌.. అతని మూడో స్థానాన్ని వితికకు ఇవ్వడంపై శివజ్యోతి అభ్యంతరం వ్యక్తం చేసింది. కంటెస్టెంట్లుగా గేమ్‌ ఆడండి.. భార్యాభర్తలుగా కాదంటూ.. శివజ్యోతి ఆవేశంతో విరుచుకుపడింది. ఏదైతే అది అవుతుందంటూ వితిక సాధించుకున్న 3వ స్థానంలోకి వెళ్లి నిలబడింది. ఇక వరుణ్‌ కూడా కంట్రోల్‌ తప్పి శివజ్యోతిపై మాటల దాడి చేశాడు. ‘కంత్రీ ఆటలు ఆడకు.. నువ్వు కూడా నీ భర్త గంగూలీని తెచ్చుకోవాల్సింది’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. దీంతో ఇంటి సభ్యుల చర్చ ఎంతకూ తెగేలా లేదని భావించిన బిగ్‌బాస్‌ అందరినీ నామినేట్‌ చేశారు. కాగా ఈ సీజన్‌లో ఇంటి సభ్యులు అందరూ నామినేషన్‌లో ఉండటం ఇదే మొదటిసారి. మరి నామినేషన్‌ హీట్‌ ఇంట్లో అలాగే కొనసాగుతుందా.. నేటి ఎపిసోడ్‌లో చల్లారిపోతుందా అనేది చూడాలి!

Poll
Loading...
మరిన్ని వార్తలు