ఉల్లి ధర రూ.500.. ఉప్పు ఐదు వేలు..!

30 Sep, 2019 22:49 IST|Sakshi

పదకొండో వారంలో బిగ్‌బాస్‌ ఇచ్చిన రాళ్లే రత్నాలు.. అనే టాస్క్‌ ఉత్కంఠగా సాగింది. రాళ్ల వర్షం కురిసినప్పుడల్లా.. హౌస్‌మేట్స్‌ వాటిని సంపాదించడం కోసం పరిగెత్తడం.. తీరా వాటిని చేజిక్కించుకున్నాక కాపాడుకోవడం కోసం తంటాలు పడటం హైలెట్‌గా నిలిచింది. రాళ్ల వర్షం కురిసే సమయానికి రాహుల్‌ అందుబాటులో లేకపోయే సరికి.. అతను వెనకబడిపోయాడు. అయితే రాళ్లను సంపాదించడం కోసం శివజ్యోతి దగ్గరకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. పున్ను వద్ద నుంచి లాక్కుందామని ప్రయత్నించగా.. రాహుల్‌ చేతిని కొరికేసింది. 

వారు సంపాదించుకున్న రాళ్లను గంపలో దాచుకున్నారు. రెండో సారి రాళ్ల వర్షం కురవగా.. వాటిని ఏరుకోవడం అందరూ బిజీ అయ్యారు. మహేష్‌ దగ్గరి నుంచి లాక్కోవడానికి రాహుల్‌ ప్రయత్నించడంతో.. అతను ఫైర్‌ అయ్యాడు. ఆవేశంతో తన దగ్గరున్న రాళ్లను విసిరిపారేశాడు. ఎవరికేం కావాలో తీసుకోండని కోపంగా అన్నాడు. అయితే రెండు వందలు విలువచేసే రాయిని పునర్నవికి మహేష్‌ ఇచ్చాడు. అయితే చివరకు తన తప్పును తెలుసుకున్న మహేష్‌.. తన రాళ్లను తనకివ్వమని బతిమిలాడాడు. అయితే పున్ను మాత్రం తిరిగి ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఫన్‌ క్రియేట్‌ అయ్యేలా చేసింది.

మొదటి బజర్‌ మోగేసరికి రాహుల్‌ దగ్గర తక్కువ విలువ రాళ్లు ఉండటంతో అతను నేరుగా నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. కానీ వారంతా నిత్యావరసరాలను తీర్చుకోడానికి చాలా కష్టపడ్డాల్సి వచ్చింది. ఉప్పు ధర ఐదు వేలు, ఒక్క ఉల్లిగడ్డ ధర రూ.500, పసుపు వెయ్యి రూపాయలని చెప్పేసరికి వారి గుండె బద్దలైంది. అయినా ఉప్పు లేకుండా వంట ఉండదు కాబట్టి తలా ఇంత వేసుకుని వంట చేసుకున్నారు. అయితే ఈ టాస్క్‌ పూర్తయ్యే సరికి తిండి కోసం తిప్పలు పడేట్టు కనిపిస్తోంది. టాస్క్‌ కంప్లీట్‌ అయ్యే వరకు ఇంటి లోపలకి అడుగు పెట్టకూడదనే కండీషన్‌పెట్డాడు. రేపటి ఎపిసోడ్‌లో ఈ టాస్క్‌ మరింత ఆసక్తికరంగా మారనున్నట్లు కనిపిస్తోంది.

>
మరిన్ని వార్తలు