బిగ్బాస్ ఇంట్లో కొత్త జోష్ వచ్చినట్టయింది. దసరా సంబరాలతో ఇంటిసభ్యుల్లో నూతనోత్సాహం వెల్లువెత్తింది. ఇక వేడుకలను మరింత రక్తికట్టించడానికి బిగ్బాస్ ఇంట్లోకి వచ్చిన అతిథిని చూసిన ఇంటిసభ్యులంతా ఎగిరి గంతేశారు. ఇక తాజా ఎపిసోడ్లో బిగ్బాస్ ఇంట్లో ఫుడ్మేళా ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఇంటిసభ్యులను రెండు టీమ్లుగా విడగొట్టారు. బాబా భాస్కర్, వరుణ్, మహేశ్, అలీ రెజా ‘ఎ’ టీమ్గా.. శ్రీముఖి, వితిక, రాహుల్, శివజ్యోతిలు ‘బి’ టీమ్గా ఏర్పడ్డారు. ఫుడ్ క్వాలిటీ చెక్ మేనేజర్లుగా వరుణ్, వితిక వ్యవహరించారు. బిగ్బాస్ ఇచ్చే ఫుడ్ ఆర్డర్లను ఎవరు రుచికరంగా చేస్తారో వారు పాస్ అయినట్లుగా క్వాలిటీ చెక్ మేనేజర్లు ప్రకటిస్తారు.
మొదట చైనీస్ ఫుడ్, తర్వాత ఆంధ్రా స్పెషల్, చివరగా తీపి వంటకాలను తయారుచేయండంటూ బిగ్బాస్ మూడు రౌండ్లు పెట్టాడు. మొదటి రౌండ్లో రెండు టీంలు ఒక్క పాయింటును కూడా చేజిక్కించుకోలేకపోగా రెండవ రౌండ్లో రెండు టీమ్లు చెరో పాయింట్ను దక్కించుకున్నాయి. బి టీమ్ ఒక పాయింట్తో గెలిచింది. ఇక వంట చేసే సమయంలో శ్రీముఖి చేతికి గాయం అయినప్పటికీ గరిట తిప్పడం ఆపలేదు. పైగా రాహుల్తో ఉన్న వైరాన్ని మరిచి అతనికి గోరు ముద్దలు కూడా తినిపించింది. మరోవైపు వంట చేస్తున్నప్పుడు బాబా, అలీకి మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. ఇక ఫుడ్మేళాతో బిగ్బాస్ ఇంట్లో ఘుమఘుమలు నిండిపోయాయి.
సోగ్గాడి గ్రాండ్ ఎంట్రీ..
దసరా సంబరాలను మరోమెట్టు పైకి ఎక్కించడానికి బిగ్బాస్ ఇంట్లోకి మన్మథుడు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. పంచె కట్టుకుని అసలు సిసలైన పండగ లుక్లో కింగ్ నాగార్జున ఇంట్లోకి అడుగుపెట్టాడు. ఘుమఘుమలతో ముక్కుపుటాలదురుతున్నాయంటూ నేరుగా ఫుడ్మేళా ఏర్పాటు చేసిన ప్రదేశానికి వెళ్లాడు. మూడవ రౌండ్లో రెండు టీమ్లు తయారు చేసిన తీపి వంటకాన్ని రుచి చూసి ‘బి’ టీమ్ గెలిచినట్లుగా ప్రకటించాడు. ఇంటిసభ్యులందరితో కలిసిపోతూ చలోక్తులు విసురుతూ ఇంట్లో కొత్త జోష్ను నింపారు. పండగ స్పెషల్గా నాగార్జున ఇంటిసభ్యులకు స్వీట్లు అందించి వారి నోరు తీపి చేశారు. అంతేకాక వారికోసం ప్రత్యేకంగా గిఫ్ట్లను కూడా తీసుకొచ్చారు. ఇక పండగ సరదా డబుల్ అయింది అని చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి!