మిగిలింది రెండు రోజులే అంటున్న రాహుల్‌ తల్లి

31 Oct, 2019 16:05 IST|Sakshi

బిగ్‌బాస్‌ 3 టైటిల్‌ ఎవరు ఎగరేసుకుపోతారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టైటిల్‌ రేసులో రాహుల్‌ సిప్లిగంజ్‌, శ్రీముఖి, బాబా భాస్కర్‌, అలీ రెజా, వరుణ్‌లు ఉన్నారు. అయితే ప్రధాన ఫైట్‌ మాత్రం రాహుల్‌, శ్రీముఖి మధ్యలోనే ఉంది. ఓట్లు వేయడానికి రేపు ఆఖరి రోజు కావటంతో అభిమానులు తమతమ ఫేవరెట్‌ కంటెస్టెంట్లకే ఓట్లు గుద్దండంటూ ప్రచారంతో సోషల్‌ మీడియాను ఊపేస్తున్నారు. ఓవైపు శ్రీముఖి ‘రాములమ్మ కాంటెస్ట్‌’తో ప్రేక్షకులను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. అది ప్రేక్షకులపై ఏపాటి ప్రభావం చూపిస్తుందో గ్రాండ్‌ ఫినాలేనాడు తేలనుంది. మరోపైపు రాహుల్‌ సిప్లిగంజ్‌ కోసం ప్రముఖ సింగర్‌ నోయెల్‌ గట్టి ప్రచారమే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఇంకాస్త డోస్‌ పెంచుతూ రాహుల్‌ తల్లి రంగంలోకి దిగింది.

ఇంతకు మునుపు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చిన రాహుల్‌ తల్లి ఇంటి సభ్యులతోపాటు ప్రేక్షకుల మనసులనూ గెలుచుకుంది. హౌస్‌ను వీడి వెళ్లేముందు రాహుల్‌కు టాస్క్‌లు బాగా ఆడమని సూచించింది. అమ్మ మాట రాహుల్‌కు టాబ్లెట్‌లా పనిచేసిందేమో! తర్వాతి టాస్క్‌ల్లో తానేంటో నిరూపించుకుని టికెట్‌ టు ఫినాలే అందుకున్న ఫస్ట్‌ ఫైనలిస్టుగా నిలిచి రాహుల్‌.. అమ్మ మాట నిలబెట్టుకున్నాడు. మరి ఇప్పుడు ఏకంగా బిగ్‌బాస్‌ టైటిల్‌ కావాలని ఆమె రాహుల్‌ అభిమానులను కోరుతోంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేసింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. రాహుల్‌ మంచితనం, నిజాయితీ, ముక్కుసూటి మాటలను మెచ్చి ఇక్కడిదాకా తీసుకొచ్చారు. మిగిలిన రెండురోజుల్లోనూ మీ ప్రేమను ఓట్ల రూపంలో చూపించి రాహుల్‌ను గెలిపించమని కోరింది. మరి చిచ్చా(రాహుల్‌) ఫ్యాన్స్‌ అమ్మ మాట నెరవేరుస్తారో లేదో చూడాలి!

మరిన్ని వార్తలు