ఆయనే అసలైన విజేత: శ్రీముఖి

11 Nov, 2019 11:14 IST|Sakshi

బిగ్‌బాస్‌ విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ అయినా.. ప్రేక్షకుల మనసు గెలిచింది మాత్రం బుల్లితెర రాములమ్మేనంటూ శ్రీముఖి అభిమానులు చెప్పుకొచ్చారు. ఇక బిగ్‌బాస్‌ పూర్తవగానే  శ్రీముఖి మీడియాకు చిక్కకుండా విహారయాత్రకు మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ తన ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్‌ చేసింది. ఈ క్రమంలో అభిమానులతో మొదటిసారి లైవ్‌లోకి వచ్చింది. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌ షో గురించి పలు ఆసక్తికర అంశాలను పంచుకుంది. ముందుగా తనకు ఎంతగానో మద్దతు తెలిపిన ఝాన్సీ, రష్మీ, ముక్కు అవినాష్‌, ఆటో రాంప్రసాద్‌లకు కృతజ్ఞతలు తెలిపింది. అదే సమయంలో బిగ్‌బాస్‌ స్క్రిప్టెడ్‌ కాదన్న విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్లుగా చెప్పింది.

గర్వపడే షోలు చేస్తా..
‘నామినేషన్‌లోకి వచ్చినప్పుడు భయపడలేదని, ఎందుకంటే తానే తప్పూ చేయలేదని, పైగా అభిమానులు సేవ్‌ చేస్తారన్న నమ్మకముండేదని చెప్పుకొచ్చింది. ట్రెడిషనల్‌గా, మోడ్రన్‌గా, మేకప్‌తో, మేకప్‌ లేకుండా అన్ని రకాలుగా చూశారు. నన్ను మీ ఇంట్లో అమ్మాయిగా ఆదరించారు. నువ్వే మాకు రియల్‌ విన్నర్‌ అని చాలా విషెస్‌ వచ్చాయి. బిగ్‌బాస్‌ ట్రోఫీ, మనీ ఏవీ నాకు వద్దు.. మీ ప్రేమ నాకు చాలు. బిగ్‌బాస్‌ షో తర్వాత ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. పటాస్‌కు వస్తానో లేదో ఓ వారం తర్వాత చెప్తాను. కాస్త విశ్రాంతి తీసుకుంటున్నా. వారంలోనే షూటింగ్‌కు వచ్చేస్తా. ఇకనుంచి మీరు గర్వపడే షోలు చేస్తా’నని శ్రీముఖి మాటిచ్చింది.

అంత త్వరగా గెలిస్తే కిక్‌ ఉండదు
‘బిగ్‌బాస్‌లో మరిచిపోలేనిది మా అమ్మ, తమ్ముడు వచ్చిన సందర్భం. ఇంకా బాబాతో నా పరిచయం. అతని నుంచి చాలా నేర్చుకున్నాను. బిగ్‌బాస్‌లో ఇటుకల టాస్క్‌ బాగా ఎంజాయ్‌ చేశాను. ఈ టాస్క్‌తో కెప్టెన్‌ కూడా అయ్యాను. కోడలిగా చేయడం బాగా నచ్చింది. చూడటానికి నచ్చిన టాస్క్‌.. తికమకపురం (గ్లాస్‌ పగలగొట్టింది). గెలిస్తే.. అక్కడితో ఆగిపోతాం. కానీ ఓడిపోతే.. ఇంకా ఏదో చేయాలి, నన్ను నేను ఇంకా ఇంప్రూవ్‌ చేసుకోవాలి అనిపిస్తుంది. జీవితంలో సక్సెస్‌ అంత త్వరగా చూసేస్తే కిక్‌ ఉండదు’.

నావరకూ ఆయనే అసలైన విజేత
‘బాబా భాస్కర్‌ అసలైన విన్నర్‌. టాస్క్‌ల్లోనూ, వండి పెట్టడంలోనూ, అతని ప్రవర్తన, ఎంటర్‌టైన్‌మెంట్‌ అన్నీ కలిపి అతనే విజేత. బాబా తర్వాత తమన్నా సింహాద్రి ఇష్టం. రాహుల్‌ నా ఫ్రెండ్‌. పరిస్థితుల వల్ల మా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. బిగ్‌బాస్‌లో జరిగినవి అక్కడే వదిలేశా. బిగ్‌బాస్‌ హౌస్‌లో కనుబొమ్మలు తీసుకుంటున్నట్టు నటించి పడుకున్న సందర్భాలు ఉన్నాయి. దాన్ని బిగ్‌బాస్‌ గుర్తించలేదు. తర్వాత ఇది మగవాళ్లు కూడా చేశారు. టాటూ నిజమే.. నమ్మకపోతే తమ్ముడిని రుద్దమని చెప్పగా అది పోకపోవడంతో ఒరిజినల్‌’ అని శ్రీముఖి నిరూపించింది.

అవేమీ పట్టించుకోకండి
హిమజ, హేమ తన గురించి నెగెటివ్‌గా మాట్లాడిన కామెంట్‌లపై స్పందిస్తూ వాటికి కౌంటర్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని కరాఖండిగా చెప్పేసింది. ‘వాళ్లిద్దరూ షోలో ఉన్నన్ని రోజులు బాగానే ఉన్నారు. స్టేజీపై కూడా నాకోసం బాగానే మాట్లాడారు. కానీ తర్వాత ఎందుకు అలా నెగెటివ్‌గా మాట్లాడారో వాళ్లకే వదిలేస్తా. వాళ్లు వేసిన నిందలను పట్టించుకోకండ’ని తేలికగా తీసిపారేసింది. సోషల్‌ మీడియాలో తనను ట్రోల్‌ చేసినవారికి గుడ్‌లక్‌ చెప్పింది. త్వరలో ఫ్యాన్స్‌మీట్‌ ఏర్పాటు చేస్తున్నానని, వీలైనంత ఎక్కువమంది అభిమానులను కలుస్తానని శ్రీముఖి పేర్కొంది.

>
మరిన్ని వార్తలు