నయన తారతో మళ్లీ మళ్లీ

7 Jun, 2016 03:01 IST|Sakshi
నయన తారతో మళ్లీ మళ్లీ

శింబు, నయనతారలది హిట్ జంటే కాదు సంచలన జంట కూడా. ఈ మాజీ ప్రేమికుల గురించి మీడియాలో ఇప్పటికే పుంఖానుపుంఖాలుగా కథనాలు హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. శింబు నయనతారలు ప్రేమించుకున్నారు, విడిపోయారు, దూషించుకున్నారు. అయినా మళ్లీ కలిసి నటించారు. ఆ చిత్రం ఇదునమ్మఆళు. అనేక సమస్యలనెదుర్కొన్న ఈ చిత్రం ఎట్టకేలకు ఇటీవల తెరపైకి వచ్చింది. ఇది మంచి విజయం సాధించిందంటూ శింబు ఆదివారం తన మిత్ర బృందంతో కలిసి పార్టీ చేసుకున్నారు.
 
  ఇందులో సంగీత దర్శకుడు అనిరుధ్ కూడా పాల్గొనడం విశేషం. ఎందుకంటే బీప్ సాంగ్ వివాదం తరువాత శింబు, అనిరుధ్‌లు కలుసుకున్న దాఖలాలు లేవు. ఇదిలా ఉంటే శింబు ఫేస్‌బుక్‌లో తన అభిమానుల ప్రశ్నలకు బదులిచ్చారు. ఈ సందర్భంగా మళ్లీ నటి నయనతారతో కలిసి నటిస్తారా? అన్న ఒక అభిమాని ప్రశ్నకు బదులిస్తూ ఎస్ నయనతారతో మళ్లీ మళ్లీ కలిసి నటిస్తాను అని అన్నారు. మరో విషయం ఏమిటంటే బిల్లా-3 చిత్రం చేయబోతున్నానని ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
 
  దానికి బిల్లా 2018 అనే టైటిల్‌ను కూడా నిర్ణయించారు.దీంతో దర్శకుడు వెంకట్ ప్రభు మీతో చిత్రం చేయడానికి తాను రెడీ అని అనడంతో నేను పుట్టినప్పటి నుంచి రెడీ అన్నారు శింబు. మీరు, యువన్‌శంకర్‌రాజా, నేను చిత్రం చేద్దాం అని శింబు అనడమే కాకుండా బిల్లా 2018 చిత్రం వచ్చే ఏడాది ప్రారంభమై 2018లో తెరపైకి వస్తుందనీ అనడం ఇప్పుడు కోలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టాక్‌గా మారింది. కాగా ఇంతకు ముందు రజనీకాంత్ నటించిన సూపర్‌హిట్ చిత్రం బిల్లా. అదే చిత్ర రీమేక్‌లో అజిత్ నటించారు.
 
  ఆ చిత్రం విజయాన్ని సాధించింది. ఆ తరువాత అజిత్ బిల్లా-2లోనూ నటించారు. ఇప్పుడు శింబు బిల్లా-3లో నటించనున్నారన్నమాట. ప్రస్తుతం శింబు గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో అచ్చం యంబదు మడమయడా చిత్రంలో నటిస్తున్నారు. దీని నిర్మాణం పూర్తి కావచ్చింది. తాజాగా ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అంబానవన్ అసరాదవన్ అడంగాదవన్(ఎఎఎ) అనే చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో శింబు త్రిపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం.